వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జయప్రద ఎంట్రీకీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్
జయప్రద సినీ నటిగానే కాకుండా జాతీయ రాజకీయాలలో మంచి గుర్తింపు కలిగిన మహిళ. తెలుగు, హిందీ సినిమాల్లో తన నటన ద్వారా సత్తా చాటింది జయప్రద. నటిగాపీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు పిలుపుమేరకు 1994 ఎన్నికలకు ముందుగానే రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు.
అయితే 1995లో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు నేపద్యంలో మిగిలిన నేతలు మాదిరిగానే జయప్రద కూడా చంద్రబాబు శిబిరము లో చేరిపోయారు. ఆ తరువాత 1996లో టిడిపి తరుపున రాజ్యసభ సభ్యురాలిగా జయప్రద ఎంపికైనారు.
తదనంతర కాలంలో టిడిపికి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు. వరుసగా రెండు పర్యాయాలు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన జయప్రద, గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తున్న జయప్రద చంద్రబాబుతో విభేదాల కారణంగానే గతంలో టిడిపి నుంచి బయటికి వచ్చిన తిరిగి ఆ పార్టీలో చేరేందుకు ససేమిరా అంటున్నారు.
అంతేకాకుండా టిడిపి కంటే బలమైన పార్టీ కోసం చూసిన జయప్రదకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు సరైన పార్టీగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే వైయస్ జగన్తో భేటీ కానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అనుకున్నట్లుగా జరిగితే రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయం అని సమాచారం. జయప్రద సొంతూరు రాజమహేంద్రవరం అంటే ఆమె అక్కడ పోటీ చేస్తే లోకల్ కిందే లెక్క అన్నమాట. అంతేకాకుండా తన పాదయాత్రలో ఇదపా రాజమండ్రి సీటును బీసీలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.
జయప్రద కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ అయిన మురళీమోహన్కు ధీటైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్నారు ఈ విధంగా బీసీ కూడా అయిన జయప్రదకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.