కొత్తగా 40 సీట్లు..నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే సభకు హాజరయ్యే ..సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కొత్తగా 40 సీట్లు
సమావేశాలకు వచ్చే వారు తప్పకుండా కరోనా టెస్టులు చేసుకోవాలి. నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే సభకు హాజరయ్యే అవకాశం కల్పించారు అధికారులు.
మరో రెండు రోజుల్ల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశాల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు పాటించడంపై చర్చించారు. మీడియా ప్రతినిధులు, మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి అనుమతి ఇవ్వడంపైనా చర్చ జరిగింది.
పార్లమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ, మండలిలో 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అసెంబ్లీలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించామని తెలిపారు. అసెంబ్లీకి వచ్చే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
రెండు రోజుల ముందే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మాస్క్ ఉంటేనే సభ్యులను సభలోకి అనుమతిస్తామని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు..
సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.. సభ్యులు, అధికారులు, సిబ్బంది విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఈ టెస్టుల్లో నెగెటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతిస్తామని పోచారం స్పష్టం చేశారు. ఒక్కో సభ్యుడి మధ్య 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా అసెంబ్లీలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు అధికారులు.