తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అంటూ ఫేస్బుక్లో …బాలయ్య

తెలంగాణ సీఎం కేసీఆర్కు థ్యాంక్స్ చెప్పిన బాలయ్య
తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అంటూ ఫేస్బుక్లో బాలయ్య పోస్ట్ పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
మంచి నిర్ణయమంటూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు.
ఈ ఏడాది కొత్తగా రూపొందించిన సిలబస్లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందుపరిచారు. దీనిపై బాలయ్య స్పందించారు.

‘కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
బాలయ్య పోస్ట్
సాంఘిక శాస్త్రంలో బుక్లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న పనులకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. అప్పటికే సినిమా రంగంలో టాప్ హీరోగా ఉన్నారని.. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను ప్రస్తావించారు. కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.