ఓట్ల తొలిగింపు, అధికారుల బదిలీలకు… సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసింది వైసీపీ
చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా అన్నీ ప్రజావేదికలపైనే చేశారు ప్రతిపక్ష నేత జగన్.
బాబు నిరంకుశ వైఖరిని, అవినీతి వ్యవహారాల్ని ప్రజల ముందుంచడంలో పూర్తిగా విజయం సాధించారు.
ఇప్పుడు తన పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు జగన్.
బాబు అక్రమాల్ని ఇన్నాళ్లూ ప్రజలకు వివరించిన అధినేత, ఇప్పుడు కొన్ని విషయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు గవర్నర్ ను కలవబోతున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్లు తొలిగించిన విధానాన్ని, మరీ ముఖ్యంగా తమ పార్టీకి చెందిన ఓట్లను తొలిగించిన వైనాన్ని గవర్నర్ కు కళ్లకు కట్టినట్టు వివరించబోతున్నారు.
ప్రజల హక్కు అయిన ఓటును సామాన్యుడికి అందకుండా చంద్రబాబు అవకతవకలకు పాల్పడ్డారని గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు.
ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ వచ్చారు జగన్.
ఓటర్ల జాబితాలో ఓటు నమోదై ఉందో లేదో కాస్త ముందుగానే సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాబు పాలనలో ప్రధాన ప్రాధమిక హక్కయిన ఓటు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేసిన జగన్, అదే విషయాన్ని గవర్నర్ కు విన్నవించబోతున్నారు.
రకరకాల సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలిగించారని ఫిర్యాదు చేయబోతున్నారు.
అక్రమంగా ఓట్లు తొలిగించిన వైనంతో పాటు..
రాబోయే ఎన్నికలు సజావుగా సాగాలంటే కొందరు కీలక అధికారుల్ని విధుల నుంచి తప్పించాలని, మరికొందర్ని బదిలీ చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ నరసింహన్ కు నివేదించబోతున్నారు జగన్.
ఓట్ల తొలిగింపు, అధికారుల బదిలీలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసింది వైసీపీ.
ఇప్పుడు గవర్నర్ కు కూడా వినతిపత్రం సమర్పించబోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారుల బదిలీలపై కదలిక వచ్చే ఛాన్స్ ఉంది.