జగన్‌‌ను ఆశీర్వదించి ప్రత్యేక పూజలు చేసిన రమణదీక్షితులు!

కడప పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను వివిధ వర్గాల ప్రజలు కలుసుకున్నారు.

  • కడపలో వైసీపీ అధ్యక్షుడితో రమణదీక్షితులు సమావేశం.
  • ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్‌ను ఆశీర్వదించిన దీక్షితులు.
  • తిరుమల పవిత్రతను కాపాడాలని కోరిన మాజీ అర్చకుడు.

కడప పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను వివిధ వర్గాల ప్రజలు కలుసుకున్నారు. వీరిలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కూడా ఉన్నారు.

గురువారం ఉదయం జగన్‌ను కలిసిన ఆయన, వైసీపీ అధినేతకు శాలువ కప్పి ఆశీర్వదించి, ప్రత్యేక పూజలు, హోమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణదీక్షితులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ పులివెందులకు వచ్చి ఆశీర్వదిస్తానని అన్నారు.

అంతేకాదు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను కాపాడుతూ వచ్చారని వ్యాఖ్యానించారు.

ఆ పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించిన రమణదీక్షితులు, జగన్ అధికారంలోకి వస్తూ మళ్లీ ఆ పవిత్రతను కాపాడాలని రమణదీక్షితులు కోరారు.

దీనికి స్పందించిన జగన్.. మే 29న దీనిపై చర్చిద్దామని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, కడప నగరంలోని పెద్దదర్గాలో గురువారం సాయంత్రం జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పులివెందుల నుంచి సాయంత్రం 6 గంటలకు పెద్దదర్గాకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. దర్గా సాంప్రదాయాన్ని పాటిస్తూ జగన్‌కు తలపాగా చుట్టి సత్కరించారు.

అనంతరం జగన్‌ పెద్దదర్గాలోని హజరత్‌ పీరుల్లామాలిక్‌ సాహెబ్‌ మజార్‌ను దర్శించుకుని చాదర్‌ను సమర్పించారు.

ఆ తర్వాత పెద్దదర్గా ఆవరణలో అంజద్‌బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కలిసి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *