జగన్ రిటర్న్స్.. వల్లభనేని వంశీ కూడా జంప్?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనను ముగించుకుని వచ్చారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో దిగారు.
లండన్ లో ప్రఖ్యాత వర్సిటీలో చదువుతున్న కూతురును చూసి రావడానికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ పర్యటనను ముగించుకుని జగన్ తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయం మరింత ఆసక్తిదాయకంగా మారింది.
జగన్ లండన్ పర్యటనకు ముందు కొన్నిరోజుల పాటు నేతలు వరుసగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకంటూ వచ్చారు.
ఒకరి తర్వాత ఒకరుగా జగన్ ను కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ వచ్చారు.
ఇప్పుడు జగన్ తిరిగి వచ్చిన నేపథ్యంలో.. మరింతమంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే పని చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ జాబితాలో పలువురు నేతల పేర్లు ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ ఒకరు, మరో ఎమ్మెల్యేతో పాటు.. కోస్తా ప్రాంతానికి చెందిన నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఖరారే అని వార్తలు వస్తున్నాయి.
అలాగే మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరింత ఆసక్తిదాయకంగా.. వల్లభనేని వంశీ మోహన్ పేరు కూడా ఇప్పుడు జాబితాలోకి ఎక్కుతోంది!
తమవైపు రావడానికి ఇరవైమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓపెన్ గా ప్రకటిస్తున్నారు.
మరి ఈ నేపథ్యంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతూ ఉంది.