చంద్రబాబు ఇంటిని ఖాళీ చేసే వరకు వదిలేది లేదంటున్నారు “మంగళగిరి ఎమ్మెల్యే”….
స్థలం ఇస్తాం, ఇల్లు కట్టుకో.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆఫర్
లింగమనేని ఇల్లు భూ సేకరణలో ప్రభుత్వం తీసుకుందని చంద్రబాబు చెప్పారు.
అప్పుడు ఆ ఇల్లు ప్రభుత్వానిది.. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ప్రభుత్వ ఇంటిలో ఎలా ఉంటారు.
చంద్రబాబు లింగమనేని ఇంటిని ఖాళీ చేసే వరకు వదిలేది లేదంటున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బాబు లింగమనేని గెస్ట్హౌస్ నుంచి వెంటనే ఖాళీ చేయాలన్నారు.
సొంత ఇల్లు కట్టుకోకుండా అక్రమ నివాసంలో ఉండటం ఎందుకు.. చంద్రబాబుకి స్థోమత లేకపోతే ఇల్లుకి కావాల్సిన భూమి ఇస్తా.. ఓ ఇల్లు కట్టుకోండి అంటూ ఆఫరిచ్చారు ఆర్కే.
కరకట్టపై ఉన్న ఇల్లు భూ సమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని చెప్పారు.. భూ సమీకరణలో లింగమనేని ఇల్లు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
మరి ప్రభుత్వానికి ఇచ్చేసిన ఇల్లు ఇప్పుడు తనదని చెప్పడానికి లింగమనేనికి హక్కు ఎలా ఉందని ప్రశ్నించారు.
గతంలో లింగమనేని రమేష్, చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా మీడియా ముందు ఉంచారు.
చంద్రబాబు ఉంటోన్న ఇళ్లు ప్రభుత్వానిదో.. తనదో లింగమనేని రమేష్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఆర్కే.
తాను ఉంటోన్న ఇళ్లు ప్రభుత్వానిదని 2016 మార్చి 6న శాసన సభలో చంద్రబాబు చెప్పారు.. సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ణానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందన్నారు.
లింగమనేని రమేష్ను చంద్రబాబు భయపెట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయకపోవడం సరికాదు.. ఇప్పటికైనా ఖాళీ చేస్తే మంచిదన్నారు.
గతంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చినా ఇళ్లు అక్రమమో, సక్రమమో చంద్రబాబు చెప్పలేదని.. మరి ప్రభుత్వ భవనమైతే ఎందుకు ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారని ప్రశ్నించారు.
నైతిక బాధ్యతగా చంద్రబాబుఇళ్లు తక్షణం ఖాళీ చేయాలన్నారు. లేకపోతే చట్టం ప్రకారం సీఆర్డీఏ కమిషనర్ అక్రమ ఇంటిని కూలగొట్టాలని కోరుతున్నానని అన్నారు.
కృష్ణా కరకట్ట మీద ఉన్న ఏ అక్రమ నిర్మాణాలనూ వదిలేది లేదన్నారు ఆళ్ల. చంద్రబాబుతో పాటూ మరికొందరు చట్టపరంగా ఎంతమంది ఇంటి అద్దె తీసుకున్నారో అసెంబ్లీ సెక్రటరీని వివరాలు అడిగానని.. చంద్రబాబు ఉంటోన్న ఇంటికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకున్నారా అనేది బయటపెట్టాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చేదాకా తాను నిద్రపోనంటున్నారు ఆర్కే. లింగమనేని రమేష్ ప్రభుత్వ భూమిని కాజేసి మంగళగిరి సమీపంలో అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టారని చెప్పారు.
కాజా పంచాయతీకి బిల్డింగ్ పర్మింట్ కింద చెల్లించాల్సిన రూ.50కోట్లు కట్టకుండా తిరిగి అదేపంచాయతీపై కేసు వేశారన్నారు. ఆ అపార్ట్మెంట్లపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇక కరకట్టపై కొన్ని భవనాలకు వైఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేవారు వాటికి ఆధారాలు చూపించాలని ఆర్కే డిమాండ్ చేశారు.
చంద్రహబాబు అధికారంలో ఉండగా కరకట్ట పక్కన ఉన్నవన్నీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎందుకు ఆ పని చేయలేదన్నారు.
కరకట్ట నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షార్హులేనన్నారు.
ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఓడించినా బుద్ధిరాలేదన్నారు.