అరుదైన జంతువు దాని శరీరంపై చెమట నుంచి మలం వరకు అన్నీ ప్రత్యేకమే!…తిరుమలేశుడి సేవ కోసం టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది…

కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లిని గుర్తించారు.

తల్లితోపాటు రెండు పిల్లలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో గుర్తించారు. అనంతరం వీటిని మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థానికులు అరుదైన పునుగు పిల్లిని గుర్తించారు.

ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఖాళీగా ఉన్న పోర్షన్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి.. వంట గదిలో అరుదైన జంతువు కనిపించింది.

దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని పరిశీలించి పునుగు పిల్లి అని తేల్చారు. అనంతరం పునుగు పిల్లిని, దాని పిల్లలను మూలపాడు రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టారు.

పునుగు పిల్లి చాలా అరుదైన జంతువని, అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

పునుగు పిల్లిని ఇంగ్లిష్‌లో సివెట్ లేదా టాడీ క్యాట్ అంటారు. పునుగుపిల్లి మన దేశంతోపాటు శ్రీలంక, మయన్మార్, భూటాన్, సింగపూర్‌లలో మాత్రమే కనిపిస్తుంది.

ఈ పిల్లి శరీరంలోని గ్రంథుల ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది. ఇది సుగంధభరిత పరిమళాన్ని వెదజల్లుతుంది.

తిరుమలేశుడి సేవకు ఈ తైలాన్ని వినియోగిస్తారు. పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది.

పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్నారు. పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీస్తారు. ఇనుప జల్లెడలో పునుగు పిల్లిని ఉంచుతారు.

అందులో చందనపుకర్రను నిలబెడతారు. ప్రతి పది రోజులకు ఒకసారి పునుగు పిల్లి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుంది. అది దాని శరీరంపై కొద్దిగా అట్టకడుతుంది.

తర్వాత పునుగు పిల్లి జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు తన శరీరాన్ని రుద్దుకుంటుంది. ఇలా చేయడంతో దాని శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా కర్రకు బంకలా అంటుతుంది.
అలా వైచ్చిన తైలాన్ని తీసి ప్రతి శుక్రవారం అభిషేకం అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారు.

వన్యప్రాణి అయిన పునుగుపిల్లిని గోశాలలో బంధించి పెంచడం తప్పని గతంలో జంతు సంరక్షణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

కానీ దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని క్లాజు పేర్కొంటోంది. దీని ప్రకారమే టీటీడీ పునుగు పిల్లులను పెంచుతోంది.

కాఫీకి బోలెడు డిమాండ్:

పునుగు పిల్లి తైలానికే కాకుండా కాఫీకి కూడా ప్రపంచ మార్కెట్లో బోలెడు డిమాండ్ ఉంది. పునుగు పిల్లి కాఫీ కాయలను తిని విసర్జిస్తుంది. అలా దాని కడుపులోకి వెళ్లి బయటకు వచ్చిన కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ కప్పు ఐదు వేల వరకూ పలుకుతోంది. దీన్ని సివెట్ కాఫీ అంటారు. ఇలా ఎన్నో విశేషాలున్న పునుగు పిల్లి కృష్ణాజిల్లాలో కనిపించడంతో అటవీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి మూలపాడు అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు పునుగుపిల్లి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. తాజాగా దొరికిన పునుగు పిల్లిని బట్టి ఈ అడవిలో మరికొన్ని పిల్లులు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *