ఏసీబీ తనిఖీల్లో….. అవినీతి అధికారి భాగోతాన్ని ఓ చిన్న కాగితం బయటపెట్టింది
ఏసీబీ తనిఖీల్లో….. అవినీతి అధికారి భాగోతాన్ని ఓ చిన్న కాగితం బయటపెట్టింది
రెవెన్యూ శాఖలోని టైపిస్ట్ ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టూరిజం విభాగంలో ఎస్టేట్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఓ అధికారి కోట్లకు పడగలెత్తినట్టు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది.
టూరిజం శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ కళ్లుబైర్లు కమ్మె ఆస్తులు.
కోట్లకు పడగలెత్తిన అధికారి భాగోతాన్ని బయటపెట్టిన చిన్న కాగితం.
విజయవాడలో తహశీల్దారుగా సుదీర్ఘకాలం పనిచేసి కోట్లు కూడబెట్టిన శివరావు
బుధవారం ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి శివరావు నివాసంలో గురువారం ఉదయం వరకు సోదాలు కొనసాగాయి. ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది.
బుధవారం రూ.50 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించగా, గురువారం మరో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. విజయవాడలోని శివరావు ఇంట్లో జరిగిన ఏసీబీ దాడులను అదనపు ఎస్పీ రమాదేవి పర్యవేక్షించారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి అధికారులు పలు దస్త్రాలను పరిశీలిస్తుండగా వారికి ఓ చిన్న కాగితం లభించింది. అందులో 13 పేర్లు, వాటి పక్కన ఊరు పేరు, అంకెలు రాసి ఉన్నాయి.
దీనిపై శివరావును విచారించగా సరైన సమాధానాలు చెప్పలేదు. అందులోని ఉన్న చిట్టెమ్మ పేరు గురించి మాత్రమే తెలిపాడు.
ఆమె తన అత్త అని, మిగిలిన వారి వివరాలు తనకు తెలియదని దాటవేశాడు. ఆయన భార్యను ప్రశ్నించగా ఆమె కొన్ని వివరాలను వెల్లడించారు.
ఆన్లైన్లో ఆయా గ్రామాల్లోని ఆస్తుల వివరాలను పరిశీలించగా అవి నిజమైనవేనని తేలింది. దీంతో వెంటనే ఆ చిరునామాలోని ఇళ్లకు దర్యాప్తు బృందాలను అధికారులు పంపించారు.
అక్కడ విచారించగా తమ ఆధార్ నెంబరుతోపాటు ఇతర వివరాలను తీసుకున్నారని, తమ పేరున ఆస్తులు ఉన్నట్లు తెలియదని వారు వివరించారు. కొన్ని ఆస్తులను శివరావు భార్య బినామీలకు అమ్మినట్లు గుర్తించారు.
సమీప బంధువు ఎలక్ట్రీషియన్గా పనిచేసే సుబ్బారావు పేరున కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు.
కాగితంలో బయటపడ్డ 13 పేర్లకు గానూ బుధవారం రాత్రికి 5 ఆస్తులు వెల్లడికాగా, తెల్లవారుజాము తరువాత ఎనిమిది బినామీ ఆస్తులను గుర్తించారు.
తనిఖీలు ముగిసిన అనంతరం శివరావును ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతడికి కోర్టు మార్చి 7 వరకు రిమాండ్ విధించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-4 ద్వారా 1987లో టైపిస్ట్గా ఎంపికైన శివరావు తొలి పోస్టింగ్ రెవెన్యూ శాఖలో దక్కింది.
ఆ తర్వాత పదోన్నతిపై డిప్యూటీ తహశీల్దారుగా, తహశీల్దారుగా పనిచేశారు. గతంలో విజయవాడ అర్బన్ తహశీల్దారుగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు.
ఆ తర్వాత తహశీల్దారు క్యాడర్లో డిప్యుటేషన్పై విజయవాడ అటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఏస్టేట్ ఆఫీసర్గా ప్రస్తుతం పని చేస్తున్నారు.
కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన శివరావు విజయవాడలోని టిక్కల్ రోడ్డు స్మితా టవర్స్లో నివాసముంటున్నారు.