సత్తెనపల్లిలో విజయం తనదేనంటూ కోడెల ధీమా

సత్తెనపల్లిలో మళ్లీ విజయం నాదే.. 22న నామినేషన్: కోడెల

సత్తెనపల్లి టిక్కెట్‌ను కోడెలకు కేటాయించవద్దంటూ కొంతమంది అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నా టీడీపీ అధిష్ఠానం మాత్రం ఆయనకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

  • 1.సత్తెనపల్లిలో విజయం తనదేనంటూ కోడెల ధీమా.
  • 2.గెలుపుపై వైసీపీ నేతలకు సవాల్ విసిరిన స్పీకర్ శివప్రసాద్‌రావు.
  • 3.టీడీపీ కుటుంబం లాంటిదని, చిన్నచిన్న మనస్పర్థలు ఉంటాయని వ్యాఖ్య.

సత్తెనపల్లి నుంచి మరోసారి టీడీపీ అభ్యర్థిగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీటును కోడెలకు కేటాయించవద్దంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై కోడెల మీడియాతో గురువారం మాట్లాడుతూ… టీడీపీ పెద్ద కుటుంబం లాంటిదని, కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటి గురించి చర్చించడం అనవసరమని వ్యాఖ్యానించారు.

అధిష్ఠానం తనకు మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీకి అవకాశం కల్పించిందని తెలిపారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తనకు రెండోసారి అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కోడెల, మార్చి 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు.

గత ఎన్నికల్లో అందరూ కలిసి తనను గెలిపించారనీ, ఈ ఎన్నికల్లోనూ అలాగే కలసికట్టుగా పనిచేయాలని టీడీపీ శ్రేణులను కోరారు.

ఈ ఎన్నికల్లో తాను 15,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తాననీ, తన గెలుపును చూసి వైసీపీ నేతలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామని, తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇస్తున్నానని తెలిపారు.

సత్తెనపల్లి నియోజకవర్గానికి కోడెల శివప్రసాదరావు వద్దంటూ అసమ్మతి నాయకులు బుధవారం నిరసన తెలియజేశారు. సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కోడెల తనయుడు శివరాం తీరుపై మండిపడ్డారు.

ఈ ఐదేళ్లలో పార్టీ కోసం పనిచేసి ఎంతో నష్టపోయామని, నాయకులకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని వాపోయారు.

కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా చేశారని, కోడెల అభ్యర్థిత్వంపై సీఎం చంద్రబాబు పునఃపరిశీలన చేసి సర్వేల ఆధారంగా అభ్యర్థిని నిలపాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *