ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తీరుపై చర్యలు తప్పవంటున్న జగన్ సర్కార్

లోకేష్ మెడకు మొబైల్ ఫొటోల ఉచ్చు.. చర్యలు తప్పవంటున్న జగన్ సర్కార్
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సభ జరుగుతుండగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారని, ఇది పెద్ద క్రైమ్ అని ప్రభుత్వ పెద్దలు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
మండలి చరిత్రలో ఇదొక దుర్దినం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సభ జరుగుతుండగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపించారు.
ఇది పెద్ద క్రైమ్ అని అన్నారు.
లోకేష్.. సభలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం సభను చులకన చేయడమేనని మంత్రి కన్నబాబు అన్నా విమర్శించారు.
సభ్యుల హక్కులను నారా లోకేష్ పూర్తిగా కాలరాశారని మండిపడ్డారు. లోకేష్ తీరుపై సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే లోకేష్ ఫొటోలు తీస్తుంటే మంత్రి వెలంపల్లి, తానూ ఆయన వద్దకు వెళ్లి వద్దని చెప్పామని ఆయన తెలిపారు.
అయితే మంత్రి శ్రీనివాస్పై టీడీపీ ఎమ్మల్సీ బీదా రవిచంద్ర.. మరికొందరు దాడి చేశారని తెలిపారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వబోమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు.
డిప్యూటీ చైర్మన్ తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉందన్నారు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరినా పట్టించుకోలేదని చెప్పారు.
బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.