నాయకత్వ మార్పిడి’ అంటూ ఎలా మసిపూసి మారేడుకాయని చేశారో అలాగే ఇప్పుడు వివేకా హత్య పై : చంద్రబాబు శవ రాజకీయం
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద దాడిచేసిన నిందితుడ్ని వైఎస్సార్సీపీ నేతలు పట్టుకుని, పోలీసులకు అప్పగించబట్టి సరిపోయిందిగానీ.. లేకపోతే, ‘కోడి కత్తి’తో వైఎస్ జగన్ స్వయంగా తన మీద తానే దాడి చేసుకున్నారేమోనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించేవారే, ‘అనుకూల మీడియా’ దాన్నే ప్రచారంలోకి తీసుకొచ్చేదేమో.!
చంద్రబాబు ‘శవ’ రాజకీయాలు ఇలాగే వుంటాయ్.!
స్వర్గీయ నందమూరి తారకరామారావుని రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, దాన్ని ‘నాయకత్వ మార్పిడి’ అంటూ ఎలా మసిపూసి మారేడుకాయని చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆ ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకంటే చంద్రబాబు శవ రాజకీయాలకు నిదర్శనం ఇంకేంకావాలి.!
ఎప్పటికప్పుడు తన అమ్ములపొదిలోంచి అస్త్రాల్ని బయటకు తీస్తుంటారు చంద్రబాబు.. ఈ శవ రాజకీయాలకు సంబంధించి.
మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైతే, అక్కడికేదో ఆ హత్య వైఎస్ జగన్ చేయించారన్నట్లుగా చంద్రబాబు అండ్ టీమ్ ‘గోబెల్స్ ప్రచారం’ షురూ చేసింది.
జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్గా వున్న వ్యక్తి దారుణహత్యకు గురైతే, స్వతహాగానే, అక్కడి రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు వస్తాయి.
వివేకా హత్యకేసులో తొలుత ఆరోపణలు వచ్చింది మంత్రి ఆదినారాయణరెడ్డి మీదనే. ‘ఆ ఆరోపణలు అవాస్తవం’ అని టీడీపీ కొట్టిపారేసి వుంటే, అది వేరేసంగతి.
కానీ, అసలు రాజకీయం అప్పుడే షురూ అయ్యింది టీడీపీ నుంచి. మంత్రి ఉలిక్కిపడ్డారు.. చంద్రబాబు కంగారుపడ్డారు.. నానాయాగీ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇదొక అస్త్రంగా టీడీపీ మలిచేసింది.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డికీ, వైఎస్ జగన్మోహన్రెడ్డికీ మధ్య అభిప్రాయ బేధాల్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు, ఆ హత్యానేరాన్ని తిరిగి వైఎస్ కుటుంబం మీదకే నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
‘హత్య జరిగింది’ అనే విషయం వెంటనే తెరపైకి వస్తే, ఆ తర్వాత పులివెందులతోపాటు, కడపజిల్లాలో పరిణామాలు ఎలావుండేవో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీకాదు. దాంతో తొలుత సహజ మరణమన్న ప్రచారం జరిగింది.
ఆ తర్వాతే ‘హత్య’ అన్న విషయం తెరపైకొచ్చింది. ఇలా ‘సంయమనం’ పాటించడమే నేరమని చంద్రబాబు అండ్ టీమ్ ఆరోపిస్తే ఎలా.?
నిజాలు నిగ్గుతేల్చాల్సింది విచారణ సంస్థలే. కానీ, ఆ విచారణ సంస్థల మీద బాధిత కుటుంబానికి విశ్వాసం లేదు. అలాంటప్పుడు, సీబీఐ విచారణ కోరితే తప్పేంటో చంద్రబాబుకే తెలియాలి.
పరిటాల రవి హత్యకేసులో సీబీఐ విచారణ అడిగిన చంద్రబాబు, వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణకు ససేమిరా అంటుండడం ఆశ్చర్యకరం.
చంద్రబాబుకి ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు కూడా ఓ ప్రచారాస్త్రంగా మారిపోయింది. ‘శవ రాజకీయం’ అన్నమాటే చంద్రబాబు రాజకీయాల ముందు చిన్నదైపోయిందిప్పుడు.!