ఏపీ: ఆ జిల్లాలో ఇక ప్రతి ఆదివారం కర్ఫ్యూ.. బయటికొచ్చారో.. కలెక్టర్ సంచలన నిర్ణయం

తూర్పు గోదావరి జిల్లాలో ఇకపై ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేవలం రెండు రోజుల్లోనే తూర్పు గోదావరిలో 1,100కు పైగా కేసులు నమోదయ్యాయి.

ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

క‌రోనా కేసులు అధిక‌వుతున్న నేప‌థ్యంలో ఇకపై ప్రతి ఆదివారం 24 గంట‌ల పాటు జిల్లా వ్యాప్తంగా క‌ర్ఫ్యూ అమ‌లు చేయాలని క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.

అత్యవ‌స‌ర వైద్యసేవ‌లు, మెడిక‌ల్ షాపుల‌కు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

మిగ‌తా అన్ని సేవ‌లను ఆదివారం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక‌ ఎవరైనా ఈ నిబంధ‌న‌లు పాటించ‌కుండా రోడ్ల మీద తిరిగితే వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897, విపత్తుల నిర్వహణ చట్టం 2005 క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చరించారు.

అలాగే జిల్లాలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నిత్యావసరాల దుకాణాలు మినహా అన్ని షాపులు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.

మ‌రోవైపు అమ‌లాపురం, బండారులంక గ్రామానికి చెందిన వ్యక్తి క‌రోనా కార‌ణంగా కిమ్స్ హాస్పిట‌ల్‌లో మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *