ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఎన్నికల సమయంలో ఓటు కోసం డబ్బులు ఇచ్చేవాణ్ణి గ్రామాల నుంచి తరిమి కొట్టాలిని. ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే బతుకులు బాగు పడే అవకాశం ఉంటుందని. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాంప్రకాశ్ సిసోడియా అన్నారు. ఓటు హక్కు పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆయన గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో గిరిజన ప్రజలతో మమేకమై వివరాలు సేకరించారు. అనంతరం గోయిపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికైన వ్యక్తి ఐదేళ్లలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు,, ప్రవేశపెడుతున్న పథకాలు అమలు, నిధులు ఎంతమేర తీసుకొచ్చారు,మౌలికవసతుల పై ఎలాంటి దృష్టిసారిస్తున్నారు, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలకు సంబంధించి ఎంతవరకు కష్టపడ్డారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
సరైన పరిపాలన కావాలంటే సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ప్రధానంగా ఓటర్ జాబితాలో పేరు ఉన్నది లేనిది పరిశీలించాలని, ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. పీవో లక్ష్మీశ మాట్లాడుతూ గ్రామాలలోని యువత, మహిళలు చైతన్యవంతులైనప్పుడే సరైన నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉప కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఓటును అమ్ముకుంటే పిల్లల భవిష్యత్తును అమ్ముకున్నట్లు వుతుందన్నారు. జట్టు సంస్థ ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు గీతాలు ఆలపించి, ప్రదర్శనలు చేపట్టారు. జట్టు సంస్థ వ్యవస్థాపకులు డి.పారినాయుడు , తహసీల్దార్లు సత్యనారాయణ మూర్తి, భాస్కర్ రావు, ఎంపీటీసీ సభ్యులు కళావతి, ప్రసాదరావు ఉన్నారు