బాబు సైబర్ క్రైమ్ చేశారు.. తండ్రీకొడుకులు జైలుకెళ్లే కేసులివి: జగన్

ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వెళ్లింది. టీడీపీకి ఓట్లు వేయని వారి పేర్లు తెలుసుకొని వారి ఓట్లను తొలగిస్తున్నారు.

ఆ స్థానంలో రెండు దొంగ ఓట్లను చేరుస్తున్నారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది.

1.సైబర్ క్రైమ్ చేసిన చంద్రబాబు సీఎంగా అనర్హుడు.
2.రెండేళ్లుగా సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారు.
3.చంద్రబాబు, లోకేష్‌లు జైలుకు వెళ్లే కేసులు ఇవి.

రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్.

సేవా మిత్ర యాప్‌తో కుట్రపూరితంగా ఓట్లను తొలగించి.. దొంగ ఓట్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు.

రెండేళ్లుగా మొత్తం 59 లక్షల దొంగ ఓట్లను జాబితాలో చేర్చారని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.

ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా ఈ కుట్రలు చేస్తున్నారని.. ఇదే అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై బుధవారం గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సైబర్ క్రైమ్‌కు పాల్పడటం దొంగతనం కాదా అని ప్రశ్నించారు జగన్.

రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగి ఉండదన్నారు.

రెండేళ్లుగా ఓ పద్దతి ప్రకారం ఎన్నికల్ని మేనేజ్ చేసేందుకు చంద్రబాబు సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్‌ కంపెనీపై జరిగిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయన్నారు.

టీడీపీకి సంబంధించిన సేవా మత్రి యాప్‌ను ఐటీ గ్రిడ్ కంపెనీ తయారు చేసిందని.. ఆ యాప్‌లో ప్రజల సమాచారం ఎందుకు ఉందని ప్రశ్నించారు.

ఓ ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉండకూడని సమాచారం ఐటీ గ్రిడ్ దగ్గర ఎందుకు ఉందో చెప్పాలన్నారు జగన్.

ఈ సమాచారం సేవా మిత్రలో ఉండటం సబబేనా.. ఓటర్ల ఐడీ డేటా కలర్ ఫోటోలతో ఉందని.. మాస్టర్ కాపీ ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గర ఎలా ఉంది, ఎందుకు ఉందని ప్రశ్నించారు.

చివరికి బ్యాంక్ అకౌంట్ వివరాలు సేవా మిత్రలో ఉన్నాయని.. ఆ సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.

ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల దగ్గర ఈ సమాచారం ఉండకూడదన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు.

‘చంద్రబాబు పల్స్, ఆర్టీజీఎస్ సర్వేలు చేయించి.. ఆ సర్వే వివరాలను సేవా మిత్రలో పొందుపరిచారు.

ఆ డేటాను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ట్యాబ్‌లకు పంపి.. ఆ సమాచారంతో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు.

ఏ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు.. ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకున్నారు.

ఎవరైతే ఓటు వేయ్యరో వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఆ స్థానంలో మరో రెండు ఓట్లను జాబితాలో చేరుస్తున్నారు.

2018 సెప్టెంబర్‌లో ఈసీ ఓటర్ల జాబితాను విడుదల చేస్తే.. ఆ జాబితాను పరిశీలించి 56 లక్షల దొంగల ఓట్లు ఉన్నాయని లెక్క తేల్చాం’అన్నారు జగన్.

‘దొంగ ఓట్లపై కోర్టులో కేసు వేశాశం.. 24 పెన్ డ్రైవ్‌లు సమర్పించాం.

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోవడంతోమరో మూడు లక్షల ఓట్లు జాబితాలో చేరాయి.

అందుకే మళ్లీ జనవరిలో ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశాం. తర్వాత పట్టించుకోకపోవడంతో.. ఫారం-7 పూర్తి చేసి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం.

దొంగ ఓటును తొలగించమని కోరితే.. చంద్రబాబు పోలీసుల్ని పంపించి ఫారం-7పై కేసులు పెట్టిస్తున్నారు.

దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఓట్లను తొలగించరు.. అధికారులు సంబంధిత వివరాలను పరిశీలించి ఓటు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

ఆ తప్పును ప్రశ్నిస్తే.. మాపై ఎదురు దాడికి దిగుతున్నారు’ అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు, లోకేష్‌లను జైలుకు పంపే కేసులన్నారు జగన్. సైబర్ క్రైమ్‌కు పాల్పడినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఐటీ మంత్రిగా లోకేష్ ఈ కేసుకు బాధ్యులన్నారు.

ఇక హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెట్టారన్న ప్రశ్నపై స్పందించిన జగన్.. దొంగతనం జరిగిన చోట కేసు పెడతామన్నారు. అందుకే హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

నేరం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఆంధ్ర మధ్య యుద్ధం జరుగుతున్నట్లు డ్రామాలు మొదలు పెట్టారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *