ఒకే రోజు 50.84 లక్షల ..ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ చేసిన ప్రభుత్వం

అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఒకే రోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు నిధులను జమ చేసింది. మొత్తం రూ.5294.53 కోట్లను రిలీజ్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు నిధులను విడుదల చేసింది.

సోమవారం రాత్రి సమయంలో ఒకేసారి 50.84 లక్షల రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేశారు. మొత్తం రూ.5,294.53 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు.

జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతు బంధు అందుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం రికార్డ్ సమయంలో రైతు బంధు నిధులను విడుదల చేసింది.

2018 నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పేరిట అన్నదాతలకు పెట్టుబడి సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే.

తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు వానాకాలం, యాసంగి సీజన్లలో ఆర్థిక సాయం చేయగా.. తర్వాత దాన్ని రూ.5 వేలకు పెంచారు.

ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. దీని ప్రకారం ఐదెకరాల పొలం ఉన్న రైతుకు ఏడాదికి రూ.50 వేల ఆర్థిక సాయం అందుతుంది.

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఉద్యోగుల జీతాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది.

ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేసిన వారికే రైతు బంధు ఇస్తామని సీఎం సైతం చెప్పారు. దీంతో రైతు బంధు విషయంలోనూ ఆంక్షలు పెడతారనే ప్రచారం జరిగింది.

అలాంటిదేం ఉండదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు బంధు నిధులను రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అన్నట్టుగానే రైతు బంధు నిధులను ఒక్కరోజులోనే రైతుల ఖాతాల్లో జమ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *