వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి

ఎస్పీకి 37 స్థానాలు, బీఎస్పీకి 38 స్థానాలు కేటాయించారు. ఐదు స్థానాలను మాత్రం పక్కనబెట్టారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి బరిలో దిగబోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనుండగా.. ఎస్పీ 37 చోట్ల పోటీ చేయనుంది. ఈ మేరకు బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటనను వెలువరించారు. ఏయే లోక్‌సభ స్థానంలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే వివరాలను కూడా ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు గత నెలలో నిర్ణయించాయి. రెండూ పార్టీలు సమంగా సీట్లను పంచుకోవాలని భావించాయి.

కానీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ కంటే బీఎస్పీకి ఒక స్థానం ఎక్కువగా కేటాయించారు. కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించినప్పటికీ.. వదిలేసిన మిగతా ఐదు స్థానాలను హస్తం పార్టీకి వదిలేసినట్టు భావిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను సొంతం చేసుకుంది. మోదీ సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో యూపీ కీలక పాత్ర పోషించింది. మోదీని ఢీకొట్టడం కోసం ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి.

మాయావతి పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం పట్ల ములాయం సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

ఏ ప్రాతిపదిక ఆధారంగా బీఎస్పీకి అన్ని సీట్లు కేయించావని తన కుమారుడైన అఖిలేష్‌ను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *