గోవా:కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!

ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!
గోవాలో ఉత్కంఠకు తెరవీడింది. మనోహర్ పారికర్ అస్తమయంతో ఏర్పడిన సంక్షోభానికి అమిత్ షా ముగింపు పలికారు. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.

గోవా కొత్త సీఎం ఎవరో కాసేపట్లో తేలనుంది. గోవా అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌.. ఆ రాష్ట్రానికి నూతన సీఎంగా ఎంపికైనట్లు తెలుస్తోంది.

సోమవారం (మార్చి 18) రాత్రి 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మిత్రపక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గోవా తదుపరి సీఎంను ఎంపికచేశారు.

గోవా సీఎం ఎంపికను తేల్చే అంశంపై చర్చించడానికి సోమవారం సాయంత్రం ఆయన మిత్రపక్షాలతో కలిసి పనాజీలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కన్నుమూయడంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ కూర్పులో భాగంగా మిత్రపక్షాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.

ఈ మేరకు మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నుంచి సుదీన్ ధవాలికర్‌కు, గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి విజయ్ సర్దేశాయ్‌కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి.

12 మందితో మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పదవి రేసులో అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌‌తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే, ఎంజీపీ నేత సుదీన్‌ ధవాలికర్‌ పేర్లు వినిపించాయి.

చివరికి ప్రమోద్ సావంత్‌ వైపే మొగ్గు చూపారు. గోవా బీజేపీ చీఫ్ వినయ్ టెండూల్కర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 2017 ఎన్నికల్లో బీజేపీ 12, కాంగ్రెస్‌కు 15 స్థానాల్లో విజయం సాధించాయి. ముగ్గురు స్వతంత్రులతో పాటు ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల చొప్పున మొత్తం 21 మంది సభ్యుల మద్దతుతో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గోవాలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా నాడు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఆ పదవి నుంచి తప్పుకొని తిరిగి గోవా వచ్చేశారు.

పారికర్ మృతి, అతిస్వల్ప మెజార్టీ నేపథ్యంలో గోవాలో సీఎం పదవి కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఊగిసలాడింది.

చివరికి అమిత్ షా రాకతో ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. ఎంజీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏడాది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం సోమవారం ఉదయం పారికర్‌ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రధాని మోదీ సహా పలువరు కేంద్ర మంత్రులు, ప్రముఖులు నివాళి అర్పించారు. సాయంత్రం 5 గంటలకు మిరామర్‌ బీచ్‌లో సైనిక లాంఛనాలతో పారికర్‌ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *