జగన్‌ సభలో అపశృతి.. ఒకరి మృతి, 20మందికి గాయాలు

సభ జరుగుతున్న సమయంలో పిట్టగోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. 20మందికి గాయాలయ్యాయి. బాధితుల్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్.

1.మండపేటలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ.
2.సభ జరుగుతున్న సమయంలోనే ప్రమాదం.
3.బాధితుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు.

వైసీపీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బుధవారం (27-03-2019) వైసీపీ అధినేత జగన్ పాల్గొన్న సభలో.. భవనం పిట్టగోడ కూలింది.

ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక మృతురాలు పిల్లి రాములమ్మగా గుర్తించారు.

ప్రచార సభ ముగియగానే వైసీపీ అధినేత జగన్ ప్రమాదంపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి గాయపడిన క్షతగాత్రుల్ని పరామర్శించారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పరిస్థితిని పర్యవేక్షించాలని పార్టీ నేతల్ని ఆదేశించారు.

జగన్ ప్రచార సభకు పార్టీ శ్రేణులతో పాటూ స్థానికులు భారీగా తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి ఎక్కేశారు. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో కేరింతలు కొడుతూ.. ఓ భవనం పిట్ట గోడ వరకు వచ్చారు.

గోడ కూలగానే.. ఇటుకరాళ్లు కిందపడగా.. కొందరుపై నుంచి కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *