సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2019 నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.

జూన్ 2న ప్రిలిమ్స్ పరీక్ష దరఖాస్తుకు చివరితేది మార్చి 18

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2019’ నోటిఫికేషన్‌ను మంగళవారం (ఫిబ్రవరి 19) విడుదల చేసింది.

దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కోటా ఆమోదం తర్వాత విడుదలైన మొదటి నియామక ప్రకటన ఇదే కావడం విశేషం.

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 896 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు.

వీటిల్లో 39 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.

మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టుల వివరాలు..
పోస్టుల సంఖ్య: 896

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షల సమయానికి మాత్రం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.08.2019 నాటికి 21 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1987 – 01.08.1998 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.

ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష ఎలా ఉంటుంది…?

★ ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి.

ప్రతీ పేపర్‌కు 200 మార్కులు. పేపర్-1లో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్-2లో 80 ప్రశ్నలుంటాయి.

ఒక్కో ప్రశ్నకు 2 1/2 మార్కులు. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33% మేర కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.

★ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే రెండో దశలోని మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.

మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

★ ఇక 1750 మార్కులకు మెయిన్ పరీక్ష, 275 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుదిఎంపిక జాబితా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 19.02.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 18.03.2019.
ప్రిలిమ్స్ పరీక్ష తేది 02.06.2019.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (మెయిన్) సెప్టెంబరు 20 నుంచి

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *