TTD ఈవో ఇంకా చంద్రబాబు ఆజ్ఞలనే పాటిస్తున్నారు.. రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌పై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌పై తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీటీడీ ఈవో ఇప్పటికీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆజ్ఞలనే పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు శనివారం రమణ దీక్షితులు ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు సమాధానంగా చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా 20 మందికి పైగా వారసత్వపు అర్చకులను తొలగించారని రమణ దీక్షితులు పేర్కొన్నారు.

వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని గౌరవ హైకోర్టు టీటీడీని ఆదేశించిందని గుర్తు చేశారు. మమ్మల్ని మళ్లీ విధుల్లో తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా మాటిచ్చారని పేర్కొన్నారు.

కానీ టీటీడీ ఈవో, ఏఈవో ఇప్పటికీ చంద్రబాబు ఆజ్ఞలను పాటిస్తూ.. కోర్టు ఆదేశాలను, జగన్‌ సూచనలను పాటించడం లేదని ఆరోపించారు. తమను విధుల్లోకి తీసుకోవడంపై ఇప్పటికీ ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఇక రమణ దీక్షితులు తన ట్వీట్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అకౌంట్లను ట్యాగ్‌ చేశారు. కాగా, టీడీపీ పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆయనతో పాటు పలువురు వారసత్వ అర్చకులను తొలగించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *