చంద్రబాబుకి ‘ఎదురుదెబ్బ’……తలసాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది…. నా నియోజకవర్గానికొచ్చి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తారా.? నేనెందుకు మీ రాష్ట్రానికి వచ్చి మీకు వ్యతిరేకంగా నినదించకూడదు.? నేను ఆంధ్రప్రదేశ్కి వస్తూనే వుంటాను.. నా స్నేహితులు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వున్నారు.
నా మాట వినే ప్రజలూ వున్నారు. మీ పాలన పట్ల ప్రజలెవరూ సంతృప్తితో లేరు.. మీ ఓటమి కోసం నా వంతుగా కృషి చేస్తాను..’ అంటూ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
మరోవైపు, తలసాని శ్రీనివాస్ యాదవ్తో ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రత్యేకంగా కలిశారు .
వైఎస్సార్సీపీలోకి వెళ్ళే క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశీస్సుల్ని తోట త్రిమూర్తులు తీసుకుని వుంటారంటూ టీడీపీకి వత్తాసు పలికే మీడియా సంస్థలు కథనాలు షురూ చేశాయి.
అయితే, పార్టీ మారే విషయమై తోట త్రిమూర్తులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇటీవల మంత్రిగా తలసాని పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తనకు ఎప్పటినుంచో స్నేహితుడైన తలసానిని అభినందించడానికే వచ్చాననీ తోట త్రిమూర్తులు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తో చేతులు కలిపిన చంద్రబాబు, టీఆర్ఎస్ని ఓడిస్తామంటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రత్యేకించి సనత్నగర్ నియోజకవర్గంలో బాలయ్యతో చంద్రబాబు ప్రచారం చేయించిన తీరు, ఈ క్రమంలో బాలయ్య చేసిన హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
గుంటూరు జిల్లాకి చెందిన టీడీపీ నేతలు కొందరు, సనత్ నగర్ నియోజకవర్గంలో డబ్బులు పంచారన్న ప్రచారమూ జరిగింది. వాటన్నిటికీ ఇప్పుడు తలసాని ఇదిగో, ఇలా బదులు తీర్చుకుంటున్నారన మాటల్లో ఏ సందేహం లేదు.
‘మాకు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారు.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు మాత్రమే కాదు, కాలు కూడా పెడతాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ గిఫ్ట్ ఇచ్చేందుకోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ని ప్రత్యేకంగా ఆ పనికి పురమాయించడం, ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుండడం జరుగుతోందన్నమాట.
తలసాని ద్వారా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ‘వేలు’ పెట్టడమే ఇలా వుంటే, స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి, కాలు కదిపితే ఇంకెలా వుంటుందో చూడాలి మరి….