కర్నూలు జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలా గొడవలున్నాయి
అదిగో.. ఇదిగో.. అంటున్న కోట్ల కుటుంబం తెలుగుదేశం చేరిక వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దానికి రకరకాల రీజన్లు ఉన్నాయని అంటున్నారు.
ఆ రీజన్ల సంగతలా ఉంటే.. కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆ పార్టీలోని వారు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు.
ముందుగా కేఈ కుటుంబం కోట్ల కుటుంబం చేరిక విషయంలో అభ్యంతరాలు చెప్పిన సంగతి తెలిసిందే.
చివరకు డోన్ సీటు కేఈ కుటుంబానికే అని బాబు హామీ ఇవ్వడంతో వారు చల్లబడ్డారు. అయితే ఇదివరకూ కోట్ల, కేఈ వర్గాల మధ్యన తీవ్రస్థాయిలో హత్యారాజకీయాలు జరిగాయి.
ఇలాంటి నేపథ్యంలో వారి మధ్యన ఎలాంటి రాజీ ఉంటుందో ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.
ఇక డోన్ కాదని.. కోట్ల సతీమణికి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. ఈ నేఫథ్యంలో ఆ నియోజకవర్గంలో అసహనం కనిపిస్తూ ఉంది.
ఇన్ని రోజులూ అక్కడ టీడీపీ ఇన్ చార్జిగా ఉండిన వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నారు. కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆయన నిరసిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనుచవర్గంతో సమావేశం నిర్వహించి లొల్లి లేపుతున్నాడాయన.
ఇక ఆ సంగతలా ఉంటే.. పాణ్యం వ్యవహరం కూడా తెలుగుదేశం పార్టీలో రచ్చరేపుతూ ఉంది.
పాణ్యం టికెట్ ను రాంభూపాల్ రెడ్డికి జగన్ ఖరారు చేసినట్టే అనే వార్తల నేపథ్యంలో గౌరు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమైంది.
కర్నూలు టీడీపీలో కుదుపులు..!
ఈ నేఫథ్యంలో ఏరాసు ప్రతాపరెడ్డి అసహనంతో ఉన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కాల్సిందే అని ఆయన అంటున్నారట.
ఈ నేపథ్యంలో ఏరాసును బుజ్జగించడానికి అధిష్టానం పిలుపు అందించిందని సమాచారం. అర్జెంటుగా రావాలని.. ఏరాసును బుజ్జగిస్తున్నారట.
కర్నూలు జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలా గొడవలున్నాయి. కర్నూలు అసెంబ్లీ, నంద్యాల అసెంబ్లీ, నంద్యాల ఎంపీ సీట్ల విషయంలో పంచాయితీలు సాగుతున్నాయి.
వాటికితోడు ఇప్పుడు మరికొన్ని ఆ జాబితాలోకి చేరినట్టుగా ఉన్నాయి.