అప్పుడు కంభంపాటి నచికేత… ఇప్పుడు అభినందన్

పాక్‌ చేతికి మన వాయుసేన అధికారి యుద్ధ ఖైదీగా చిక్కడం ఇదే తొలిసారి కాదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కంభంపాటి నచికేత కూడా ఇలాగే దాయాది దేశానికి చిక్కారు.

పాకిస్థాన్‌కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భారతీయుులు కోరుకుంటున్నారు.

కార్గిల్ వార్ సమయంలో పాక్‌కు చిక్కిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కంభంపాటి నచికేత తిరిగొచ్చిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పాక్ ఆక్రమిక కశ్మీర్‌లో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేపట్టడంతో అసహనంగా ఉన్న పాకిస్థాన్ బుధవారం సరిహద్దుల్లో అలజడి సృష్టించింది.

పాక్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించగా సైన్యం ఒక దాన్ని కూల్చివేసింది. మరో విమానాన్ని వెంబడిస్తూ వెళ్లిన ఓ మిగ్ విమానం కనిపించకుండా పోవడంతో పాటు ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ పాక్ చేతికి చిక్కాడు.

దీనికి సంబంధించి పాక్ ఆర్మీ ఓ వీడియో విడుదల చేయగా, భారత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భారతీయులందరూ ప్రార్థిస్తున్నారు.

అయితే పాక్‌ చేతికి మన వాయుసేన అధికారి యుద్ధ ఖైదీగా చిక్కడం ఇదే తొలిసారి కాదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కంభంపాటి నచికేత కూడా ఇలాగే దాయాది దేశానికి చిక్కారు.

అయితే ఉత్కంఠ పరిస్థితుల నడుమ 8రోజుల తర్వాత పాక్‌ చెరను వీడి స్వదేశానికి తిరిగొచ్చారు.

1999 మేలో కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న రోజులవి. వాయుసేన స్క్వాడ్రన్‌ నంబర్‌-9లో నచికేత(26) ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు.

ఆ నెల 27న పాక్‌ స్థావరాలపై దాడి చేసేందుకుగాను నచికేత మిగ్‌-27 యుద్ధ విమానంలో పైకెగిరారు. 17 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రువులపై భీకరంగా 80 ఎంఎం ఫిరంగుల వర్షం కురిపించారు.

దురదృష్టవశాత్తూ సాంకేతిక సమస్య కారణంగా విమానం ఇంజిన్‌ ఆగిపోయింది. తిరిగి ప్రారంభించేందుకు నచికేత ప్రయత్నించినా ఫలించలేదు.

దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకుగాను విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దూకేశారు. పాక్ భూభాగంలో దిగిన ఆయన్ని పాక్ సైనికులు బంధించి చిత్రహింసలకు గురిచేశారు.

ఈలోగా నచికేత విడుదల కోసం భారత్‌ ముమ్మర ప్రయత్నాలు చేసింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పావులు కదిపింది.

పాక్‌తో చర్చలు జరిపింది. ఆనాడు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న జి.పార్థసారథి ఆ చర్చల్లో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు అంతర్జాతీయ మీడియా ఈ వ్యవహారంపై దృష్టిసారించడం, ఐరాస కూడా ఒత్తిడి చేయడంతో పాక్‌ తలొగ్గక తప్పలేదు. 8 రోజుల తర్వాత నచికేతను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.

ఆ తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాక్ సైన్యం పెట్టిన చిత్రహింసల కంటే చావే మేలని తాను భావించినట్లు చెప్పడాన్ని బట్టి యుద్ధ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నచికేత ఇప్పటికీ భారత వాయుసేన విమానాలు నడుపుతుండటం విశేషం. నచికేత లాగే అభినందన్ కూడా క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *