400 ఏళ్ల ఆచారం…దర్గాకు చేరుకున్న గ్రామస్థులు.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది.

గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు.

అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం 400 ఏళ్లుగా ఓ ఆచారం పాటిస్తోంది.మాఘ పౌర్ణిమ రోజున తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది.

తెల్లవారుజామునే సమీపంలోని దర్గాకు చేరుకున్న గ్రామస్థులు తిరిగి అర్థరాత్రి ఇంటికి చేరుకున్నారు.

అన్ని పౌర్ణమిల్లో కల్లా మాఘ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తుంటారు హిందువులు. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారని, అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పదని చెబుతుంటారు. 

మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకుల నుంచి విముక్తి కలుగుతాయని, మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ప్రస్తావన ఉంది.

ఇంతటి విశిష్టమైన మాఘ పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 400 ఏళ్లుగా విచిత్ర ఆచారం కొనసాగుతోంది.

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది.

గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది.

తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీని ప్రకారం గ్రామంలోని చిన్నా పెద్దా అంతా సూర్యుడు ఉదయించక ముందే ఇళ్లకు తాళాలు వేసి హాజివలి దర్గాకు చేరుకున్నారు. పశువులను కూడా తమతో తీసుకెళ్లారు.

గ్రామస్థులంతా కలిసి అక్కడే వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. పిల్లలు దర్గా సమీపంలో కబడ్డీ, క్రికెట్‌ తదితర ఆటలతో ఎంతో సంతోషంగా గడిపారు. సూర్యాస్తమయం తర్వాతే గ్రామానికి తిరిగివెళ్లారు.

అయినప్పటికీ రాత్రి 12 గంటల వరకు గ్రామస్థులంతా చీకట్లోనే గడిపారు.

ప్రతి ఒక్కరూ గడప గడపకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే ఇంట్లోకి వెళ్లి లైట్లు వేశారు. ఆ తర్వాత ఇళ్లను శుభ్రం చేసి పొయ్యి వెలిగించారు.

400 ఏళ్లుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని తామంతా క్రమం తప్పకుండా పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

గతంలో ఈ ఆచారాన్ని అతిక్రమించిన కొందరు కష్టాలు కొనితెచ్చుకోవడంతో పాటు, అకాల మరణం పొందారని చెబుతున్నారు.

అందువల్ల గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని నమ్మి ప్రతి సంవత్సరం మాఘ మాస పౌర్ణమిరోజు ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *