ఆ వీడియోలే కాపాడాయి.. అభినందన్ లక్కీ: మాజీ ఫైటర్ పైలట్ భార్గవ

ఆ వీడియోలే కాపాడాయి.. అభినందన్ లక్కీ: మాజీ ఫైటర్ పైలట్ భార్గవ
1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జేఎల్ భార్గవ పాకిస్థాన్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉండి విడుదలయ్యారు. ప్రస్తుతం అభినందన్ విడుదలపై ఆయన తాజాగా స్పందించారు.

వీడియోలు బయటికి రాకపోయుంటే పాకిస్థాన్ అభినందన్ అరెస్టును చెప్పేది కాదు. నా అరెస్టును నెల రోజుల తరవాత భారత్‌కు తెలియజేసింది. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌కు చిక్కి ఏడాది తరవాత విడుదలైన ఐఏఎఫ్ పైలట్ భార్గవ.

భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గాయపడిన వీడియోలు గడిచిన నాలుగు రోజులుపాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

పాకిస్థాన్‌లో అల్లరి మూక ఆయన్ని కొట్టడం, పాక్ ఆర్మీ అధికారులు ఆయన్ని బంధించి తీసుకెళ్లడం వంటి వీడియోలు చూసి ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది.

అభినందన్‌ను తీవ్రంగా గాయపరిచిన వీడియోలను ప్రపంచానికి ఎలా చూపిస్తారంటూ భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్ హై కమిషనర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘ఒకవేళ అల్లరిమూక ఆ వీడియోను సర్క్యులేట్ చేయకపోయి ఉంటే,

అయితే ఈ వీడియోలు బయటికి రావడమే మంచిదైందని అంటున్నారు ఐఏఎఫ్ మాజీ అధికారి, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ జేఎల్ భార్గవ.

1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జేఎల్ భార్గవ పాకిస్థాన్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉండి విడుదలయ్యారు. ప్రస్తుతం అభినందన్ విడుదలపై ఆయన తాజాగా స్పందించారు.

పారాచ్యూట్ సహాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన అభినందన్‌ను కొట్టిన అల్లరి మూలకలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి పనే చేశారని భార్గవ అంటున్నారు.

లేదంటే అభినందన్ పరిస్థితి వేరేలా ఉండేదని, ఆయన బతికి ఉన్నాడనేందుకు ఆధారాలు కూడా దొరకేవికావని వెల్లడించారు. అల్లరి మూక వీడియో తీయడమే అభినందన్‌ను కాపాడిందన్నారు.

‘ఒకవేళ అల్లరిమూక ఆ వీడియోను సర్క్యులేట్ చేయకపోయి ఉంటే, అభినందన్ బతికే ఉన్నాడని నిర్ధారించడం చాలా కష్టతరమయ్యేది. ఇస్లామాబాద్ కూడా ఆయన అరెస్టు కాలేదనే చెప్పేది.

ఆయన మిగిలిన జీవితమంతా పాకిస్థాన్ జైలులోనే ముగుసుండేది. 1971 యుద్ధంలో అదృశ్యమైన 54 మంది సైనికుల మాదిరిగానే అభినందన్ కూడా కనిపించకుండా పోయేవారు’ అని భార్గవ అభిప్రాయపడ్డారు.

వీడియోలన్నీ సోషల్ మీడియాలో రావడంతోనే పాకిస్థాన్ అభినందన్ అరెస్టును ప్రకటించిందని, అధికారిక వీడియోను విడుదల చేసిందని భార్గవ అన్నారు.

అప్పట్లో తన అరెస్టును నెల రోజుల తరవాత భారత్‌కు పాకిస్థాన్ చెప్పిందని గుర్తుచేశారు. అది కూడా అంతర్జాతీయ ఏజెన్సీలు జోక్యం చేసుకోవడంతో జరిగిందని వెల్లడించారు.

ఒక పైలట్ పారాచ్యూట్ ద్వారా సరిహద్దులో పడినప్పుడు అతనికి ఎదురయ్యే తొలి ప్రమాదం అల్లరిమూకేనని, అభినందన్‌ను పాకిస్థాన్ ఆర్మీ కాపాడటం నిజంగా అదృష్టమని భార్గవ చెప్పారు.

ఉదాహరణగా 1965 యుద్ధంలో జరిగిన ఒక ఘటనను భార్గవ వెల్లడించారు. ‘నా సహచర పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ హుస్సేన్ 1965 యుద్ధ సమయంలో పంజాబ్‌లో పనిచేశాడు.

అతని విమానం భారత భూభాగంలో కూలిపోయింది. అక్కడి అల్లరిమూక హుస్సేన్‌ను పాకిస్థానీ అనుకొని తీవ్రంగా కొట్టారు.

ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే కొట్టినవాళ్లే జలంధర్ కంటోన్మెంట్‌కు వచ్చి ఆయన కోసం రక్తదానం చేశారు’ అని భార్గవ వివరించారు. ప్రస్తుతం భార్గవ వయసు 77 ఏళ్లు. హర్యానాలోని పంచకులలో స్థిరపడ్డారు.

పాకిస్థాన్‌లో 12 గంటలు నన్ను నేను కాపాడుకున్నా..

1971 యుద్ధంలో తన విమానం కూలిపోయి పాకిస్థాన్‌లో పడినప్పుడు తనను తాను 12 గంటలపాటు కాపాడుకోగలిగానని భార్గవ వెల్లడించారు.

అప్పటికి తాను ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉన్నానని, 1971 డిసెంబర్ 5న బార్మర్ నుంచి హెచ్ఎఫ్-24 9లో టేకాఫ్ అయ్యానని చెప్పారు. అయితే శత్రు భూభాగంలో తన విమానం కూలిపోయిందని తెలిపారు.

‘ఉదయం 9 గంటలకు నేను విమానంలో నుంచి బయటపడ్డాను. పాకిస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో పడ్డాను. యుద్ధంలో పాల్గొనే పైలట్‌కు మ్యాప్, పిస్తోల్ తదితరాలతో కూడిన సర్వైవల్ ప్యాక్, పాకిస్థాన్ కరెన్సీ ముందుగానే ఇస్తారు.

నేను నా సర్వైవల్ ప్యాక్‌ను తీసుకొని, నా జి-ష్యూట్‌ను తీసేసి ఇసుకలో పూడ్చేశాను. ఇక అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టాను. 12 గంటలు నడిచి ఓ గ్రామానికి వెళ్లాను.

నా పేరు మన్సూర్ అలీ అని, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలట్‌నని అందరికీ చెప్పాను. వారిని నమ్మించడానికి నా వద్ద ఉన్న పాకిస్థానీ కరెన్సీ చూపించాను.

అయితే స్కూల్ హెడ్ మాస్టర్ నా మాటలు నమ్మలేదు. ఏ ఊరు అని అడిగాడు. రావల్పిండి అని చెప్పాను. రావల్పిండిలో ఎక్కడ అన్నాడు. మాల్ రోడ్ అని చెప్పాను.

దీంతో అతను మీరు భారత్‌లోని ఓ గ్రామంలో ఉన్నారు అని అన్నాడు. నేను వెంటనే దయచేసి నన్ను పాకిస్థాన్ పంపేయండి అన్నాను.

నేను పాకిస్థానీని అవునా కాదా అని పరీక్షించడానికే ఆయన అలా అడిగాడని నాకు అర్థమైంది.

కొంత సేపటికి నా వద్దకు పాకిస్థాన్ రేంజర్స్ వచ్చారు. ఖలీమా చదవమని నన్ను అడిగారు. నా వల్ల కాలేదు. దొరికిపోయాను’ అని అప్పటి ఘటనను భార్గవ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *