మఖ్యమంత్రి కొండవీడు పర్యటన సందర్భంలో…. రైతు ఆత్మహత్యపై విష ప్రచారం.. గుంటూరు ఎస్పీ వార్నింగ్

గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.

రైతు ఆత్మహత్యపై విష ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం.కోటేశ్వరరావును కాపాడటానికి పోలీసులు ప్రయత్నించారని వివరణ.తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక.

కొండవీడు కోట ఉత్సవాల్లో ఏసీ సీఎం చంద్రబాబునాయుడు పొల్గొన్న సమయంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.

వైసీపీ అధినేత ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వివాదంపై పోలీసులు ఘాటుగానే స్పందించారు.

గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రైతు ప్రాణాలను కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే, తామే కొట్టి చంపామని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని, తామే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని వ్యాఖ్యానించారు. మఖ్యమంత్రి కొండవీడు పర్యటన సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై ఎస్పీ వివరణ ఇచ్చారు.

రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల భూమి ఉందని, ఇది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. దీనిలోని నాలుగెకరాల ఖాళీ భూమిలో ఆయన అనుమతి తీసుకొనే పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

సోమవారం ఉదయం 10 గంటలకు కోటేశ్వరరావు మందు తాగినట్టు గస్తీ పోలీసులకు సమాచారం అందిందని అన్నారు.

రైతు ప్రాణాలను కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌ ఆయనను భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు.

పోలీసులు అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనంతో ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు అప్పటికే ఆయన మృతిచెందాడని, ఈ దుర్ఘటన సీఎం పర్యటనకు దాదాపు 4 గంటల ముందు చోటు చేసుకుందని ఎస్పీ రాజశేఖర్ వివరించారు.

కోటేశ్వరరావు పురుగుల మందు తాగిన విషయాన్ని వారి పాలేరు సమీపంలో ఉన్న పోలీసులకు చెప్పకుండా రైతు కుమారుడికి ఫోన్‌ చేసినట్టు తెలిపారు.

ఈ సంఘటన జరిగిన అర గంట వరకు పోలీసులకు విషయం తెలియనీయలేదని, తమ ఉద్యోగులు తప్పు చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కొండపైకి ఒకే మార్గం ఉండటం వల్ల సీఎంతోపాటు వీవీఐపీలు, వేలాది మంది ప్రజలు వస్తారని భావించి భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ద్విచక్రవాహనాలను పైకి అనుమతించలేదని స్పష్టం చేశారు.

కోటేశ్వరరావు కుమారుడు బైక్‌పై వస్తే వాహనానికి అనుమతి లేదని మాత్రమే పోలీసులు చెప్పారని తెలిపారు.

హెలీప్యాడ్‌కు 700 మీటర్ల వెనక ఎక్కడో దూరంగా రైతు భూమి ఉందని, దీనికి ఆయన స్థలం తీసుకున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

అలాగే, సీఎం వచ్చినప్పుడు హెలీప్యాడ్‌ వద్దకూ ఎవరూ రావొద్దని మాత్రమే హెచ్చరించారు తప్ప ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారితో దర్యాప్తు చేయిస్తున్నామని తెలియజేశారు. తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనేది తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీని వెనుక రాజకీయ పార్టీల పాత్ర ఉన్నట్టు ఏమైనా అనుమానాలున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *