జనసేన తొలి జాబితా ప్రకటన ముహూర్తం ఖరారు……
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి జోరందుకుంటోంది. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాయి.
ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన కూడా తొలి జాబితాను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితా విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసింది.
దీంతో జనసేన నుండి పోటీ చేయాలని అనుకొనే ఆశావాదులలో ఉత్కంఠ మొదలైంది.
ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు విషయమై నివేదికలు పవన్ కి అందాయి.
దీనిని అనుసరించి తొలుత కమిటీని ప్రకటించి, ఆ తర్వాత వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఈనెల 26 న రిపబ్లిక్ డే రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ ముహూర్తం నిర్ణయించారు.
మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న పార్టీ అయినప్పటికీ ఇదివరకే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జనసేన లో చేరడంతో వారిని కూడా తొలి జాబితాలో నే పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది.
జాబితాలో వీరికే టిక్కెట్లు వచ్చే అవకాశం
2019 ఎన్నికల బరిలో పోటీ అభ్యర్థులను 26న ప్రకటించనున్నట్లు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
తొలి జాబితాలో గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది.
జనసేన తొలి అభ్యర్థిగా ఇప్పటికే ముమ్మిడివరం బిసి వర్గానికి చెందిన ‘పితాని బాలకృష్ణ’ ని ప్రకటించారు.
రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ‘ఆకుల సత్యనారాయణ’, రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థిగా ‘కందుల దుర్గేష్’, కాకినాడ రూరల్ నుండి ‘అనిసెట్టి బుల్లబ్బాయి’, రాజోలు నుండి ‘రాపాక వరప్రసాద్’, మండపేట నుండి ‘దొమ్మేటి వెంకటేశ్వర్లు’,తుని నుండి ‘రాజా అశోక్ బాబు’….. వీరిలో కొన్ని పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలో ‘తోట చంద్రశేఖర్’, ‘నాదెండ్ల మనోహర్’ వంటివారు ఉండే చాన్స్ ఉంది.
ఇతర పార్టీలకు దీటుగా అభ్యర్థులను ఖరారు చేసి, వారిని ప్రచారంలోనికి దింపాలని జనసేన భావిస్తోంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు తొలి జాబితాలో స్థానం ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తో ముందుకు వెళ్లడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.