నైతికత గురించి మాట్లాడుతున్న ‘తెలుగు’ మీడియా!
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ పదవులకు రాజీనామాలు చేసే వెళ్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికే గాక.. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా అవంతి శ్రీనివాస్ ప్రకటించారు
. అంతకుముందు మేడా మల్లిఖార్జునరెడ్డి స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం, దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి.
ఇక ఆమంచి కృష్ణమోహన్ గెలిచింది తన సొంత పార్టీ తరఫున. నవోదయం పార్టీ అంటూ ఏపీ అసెంబ్లీలో ఒకటి ఉంది. దాని తరఫున ఆమంచి గెలిచాడు.
అది ఆయన సొంత పార్టీ లెక్క. కాబట్టి ఎటు వెళ్లే అధికారం అయినా ఆయనకే ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే తరహాలో ఉంటారు ఆమంచి.
వీళ్లే కాదు.. తనవైపు ఎవరు రావాలన్నా.. వాళ్లు తెలుగుదేశం పార్టీ తరఫున లభించిన పదవులకు రాజీనామాలు చేయాలని జగన్ షరతు పెడుతున్నారు.
అందులో భాగంగా శిల్పా చక్రపాణి రెడ్డి లాంటివాళ్లు కూడా రాజీనామాలు చేసే వైకాపాలోకి చేరిన వైనం చూశాం.
రాజకీయ చేరికల విషయంలో జగన్ పూర్తి నైతికతకు కట్టుబడుతూ ఉంటారు. అయితే అనైతిక రాజకీయం చేసి.. ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకుని, వారిచేత వైకాపా ద్వారా దక్కిన పదవులకు రాజీనామాలు చేయకుండా.. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
అలాంటి చేరికల సమయంలో అదో రాజకీయ విజయంగా వార్తలు వండి వార్చింది తెలుగుదేశం అనుకూల మీడియా.
అలాంటి మీడియా ఇప్పుడు నేతలు పార్టీలు మారడం అనైతికత అంటోంది! నేతలు రాత్రికి రాత్రి పార్టీలు మారుతున్నారని వాపోతోంది! మరి ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలకు.
చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు.. తెలుగుదేశానికి, తెలుగుదేశం అనుకూల మీడియాకు నైతికత గుర్తుకు రాలేదు. అయితే ఇప్పుడు నేతలు ఆయా పదవులకు రాజీనామాలు సైతం చేసి బయటకు వెళ్తుంటే. నైతికత గురించి మాట్లాడుతున్నారు, ఇది వీళ్ళ అనైతికత.