ఫలితాలకు ముందురోజే టీడీపీ నేత దారుణ హత్య.. డోన్‌లో ఉద్రిక్తం

కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్‌ మండలం మల్లెంపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

టీడీపీ నేత శేఖరరెడ్డి తన స్వగ్రామం కృష్ణగిరి మండల చాపలకొత్తూరు నుంచి ద్విచక్రవాహనంపై డోన్‌ వెళ్తుండగా ప్రత్యర్థులు మాటువేసి దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాడ్డులతో దాడిచేసి, బండరాయితో తలపై మోదారు.

దీంతో తీవ్రరక్తస్రావమైన శేఖర్ రెడ్డిఅక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. చాపలకొత్తూరు వద్ద శేఖరరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. 

మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు.

మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఎన్నికలకు ముందే హతుడు శేఖరరెడ్డి కోట్ల వర్గంతో కలిసి టీడీపీలో చేరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *