బాబుతో టీ కాంగ్రెస్ నేత భేటీ.. జగన్ సీఎం కాకూడదని సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళవారం అమరావతిలో భేటీ అయినప్పుడు ఆయన వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రితో తెలంగాణ కాంగ్రెస్ నేత భేటీ.జగన్ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుకోవాలని బాబుకు సూచన.మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందంటూ బాబు వ్యాఖ్య.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళవారం అమరావతిలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చూడాలని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిసూచించారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతి వచ్చిన శశిధర్ రెడ్డి, చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ కూటమిగా ఏర్పడినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
పొత్తు ఎందుకనే విషయాన్ని ప్రజలకు వివరించడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమైందని, అందుకే ఓటమిపాలైనట్టు శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు భోగట్టా.
రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఏపీకి జగన్ సీఎం కాకుండా అడ్డుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మర్రి.. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయని వివరించారు.
తాము ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే జగన్ తాను అధికారంలోకి వచ్చాక చేస్తానని చెబుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
భేటీ అనంతరం మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలయికను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ఆయన తెలియజేశారు.