పార్టీ మార్చిన సూపర్ స్టార్ సోదరుడు…
ఎన్నికల నేపథ్యంలో పొలిటిషియన్స్ కండువా మార్చడం సర్వసాధారణం అదే కోవలోకి చెందిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గతంలో వైసీపీలో ఉన్న ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
ఈ సంఘటన పై హర్షం ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
విజయవాడ తుమ్మల పల్లి కళా క్షేత్రం లో జరిగిన కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో కృష్ణ అభిమానులకు సూచనలు చేశారు.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేలా ఆ పార్టీ ప్రయత్నం చేసిన సంగతి మనకు తెలిసిందే.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆయన నివాసానికి ఇవాళ టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్ వెళ్లారు.
తెలుగుదేశం పార్టీలోకి తను చేరాలని కోరారు. దీనికి స్పందించి ఆయన టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు స్పందిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పలు ప్రాజెక్టులను (దానిలో భాగంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ) ముందుకు తీసుకు పోతున్నారని ఆయనను అభినందించారు.
చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరినీ ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి పార్టీ గెలవాలని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు.
మా అన్నయ్య కృష్ణ దీవెనలు తీసుకున్నాను. ఆయన అభిమానులు టిడిపి విజయాని కి కృషి చేయాలని ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు.