మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ… కుల ప్రస్తావన లేకుండా పవన్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా విమర్శించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు.
కాపు నేస్తంపై పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని.. గతంలో కాపులను మోసం చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ఈ మేరకు మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… కుల ప్రస్తావన లేకుండా పవన్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా విమర్శించారు.
కాపులకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి కన్నబాబు అన్నారు.
కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశామని.. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్కు ఎందుకంత ఉక్రోషమని ప్రశ్నించారు. ఓర్వలేనితనంతోనే పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారని పేర్కొన్నారు.
ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న మహిళలను బూతులు తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని చెప్పారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్కార్ అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో పవన్కు కళ్లు కనిపించలేదని.. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారని విమర్శించారు.
కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు.