ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు…

టీ కాంగ్రెస్‌కు మరో షాక్.. కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి!
కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు.

ఆమె త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆదివారం ఆమె కేటీఆర్, కవితను కలిశారు.

1.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.
2.సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
3.ఆదివారం కేటీఆర్, కవితతో ఆమె భేటీ అయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మె్ల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆందోళనలో ఉన్న రాష్ట్ర నాయకత్వానికి మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి ఝలక్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆమె త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్‌లో రాహుల్ సభ తర్వాత ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ వార్త మింగుడు పడటం లేదు.

చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబిత.. వైఎస్ హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

దేశంలోనే ఓ రాష్ట్రానికి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారనున్నారన్న ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.

శనివారం శంషాబాద్‌లో జరిగిన రాహుల్ సభకు సబిత హాజరైనా ముభావంగానే ఉన్నారు. మరుసటి రోజే ఆమె కేటీఆర్‌, కవితను కలవడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.

కొద్దిరోజుల క్రితమే సబిత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయినట్లు సమాచారం. సబిత టీఆర్ఎస్‌లోకి వచ్చేలా ఆయనే మధ్యవర్తిత్వం వహిస్తు్న్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈరోజు అసద్ ఇంట్లో కేటీఆర్, కవితతో సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఆమె కారెక్కడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందే సబిత ఝలక్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *