ఓ అమరవీరుడి భార్య తన భర్తకు సరైన నివాళి అందించేందుకు సిద్ధమైంది.
సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన మేజర్ భార్య ఆర్మీలో చేరుతోంది. ఇందుకు సంబంధించి అన్ని పరీక్షల్లో ఆమె పాస్ అయింది. 49 నెలల శిక్షణ అనంతరం వచ్చే ఏడాది సైన్యంలో చేరనుంది.
Highlights
- ఓ అమరవీరుడి భార్య తన భర్తకు సరైన నివాళి అందించేందుకు సిద్ధమైంది.
- దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన తన భర్తకు నివాళిగా తాను కూడా సైన్యంలో చేరేందుకు సిద్ధమైంది.
దేశ
రక్షణలో అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు
నిర్వహిస్తుంటారు మన సైనికులు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలకు దూరంగా
భరతమాత సేవలో తరిస్తుంటారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు.
అయితే తమ వారు చనిపోయినా మొక్కవోని ధైర్యంతో జీవించడం ఒక్క జవాన్ల
కుటుంబాలకే సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి చనిపోతే కొడుకు, అన్న
చనిపోతే తమ్ముడు ఆర్మీలో చేరిన సందర్భాలు ఎన్నో. విధుల్లో ఉండగా జరిగిన
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ భార్య ఇప్పుడు ఆర్మీలో చేరేందుకు
సిద్ధమవుతోంది.
ముంబయికి
చెందిన ప్రసాద్ మహాదిక్ ఆర్మీలో మేజర్ హోదా పనిచేశారు. 2012లో సైన్యంలో
చేరిన ఆయన ప్రతిభతో తక్కువ కాలంలోనే మేజర్ స్థాయికి చేరారు. బిహార్
రెజిమెంట్ ఏడో బెటాలియన్లో అత్యుత్తమ అధికారుల్లో ఒకరుగా పేరు
తెచ్చుకున్నారు. 2017లో ఇండో-చైనా బోర్డర్లో సైనిక శిబిరంలో జరిగిన
అగ్నిప్రమాదంలో ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. ప్రసాద్కు గౌరీతో 2015లో
వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు ఆర్మీలో
చేరేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ సెక్రటరీ కోర్సుతో పాటు న్యాయవాద విద్య
అభ్యసించిన గౌరీ ఆర్మీలో చేరుందుకు తన ఉద్యోగాన్ని వదులుకుంది. దేశం సేవలో
ప్రాణాలు కోల్పోయిన తన భర్తకు సరైన నివాళి అర్పించేందుకే తాను ఆర్మీలో
చేరాలని నిర్ణయించుకున్నట్లు 32 ఏళ్ల గౌరీ చెబుతోంది.
విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భార్యలు దేశ రక్షణలో పాలు
పంచుకునేందుకు ఆర్మీ అవకాశం ఇస్తోంది. ఇందుకోసం సర్వీస్ సెలెక్షన్
బోర్డ్(ఎస్ఎస్బీ) ఏటా పరీక్ష నిర్వహిస్తోంది. 2018లో నిర్వహించిన ఈ
పరీక్షలో 16మంది అర్హత సాధించగా.. గౌరీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఏప్రిల్
నుంచి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ తీసుకునేందుకు
సిద్ధమవుతోంది. 49నెలల శిక్షణ తర్వాత మార్చి, 2020లో ఆమె ఆర్మీలో
చేరనుంది. సైన్యంలో తనకు నాన్ కేటగిరీలో లెఫ్టినెంట్ హోదా ఇవ్వనున్నట్లు
గౌరీ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భర్తను తలుచుకుని
కుమిలిపోకుండా తాను కూడా ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్న గౌరీ ఎందరికీ
స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.