లక్ష్మీస్ ఎన్టీఆర్…కు .. కన్నీళ్ళే ….సమాధానం: లక్ష్మీపార్వతి

రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదలయ్యింది. ఇది వర్మ సినిమా.. అనడం కంటే, స్వర్గీయ ఎన్టీఆర్ ఆవేదన అనడమే కరెక్టేమో. అందుకే ఈ సినిమాపై అంత ఆసక్తి నెలకొంది.
స్వర్గీయ ఎన్టీఆర్ చాలా గొప్పోడు.. ఇది చాలామందికి తెల్సిన విషయం. భౌతిక మరణానికి ముందు, ఆయన మానసికంగా చచ్చిపోయిన సందర్భాలు చాలానే వున్నాయి.
వాటి గురించి ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ, చంద్రబాబు కనుసన్నల్లో మీడియా.. వాస్తవాల్ని కప్పిపుచ్చేసింది..
కానీ, ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఆ ‘కప్పి వేయబడ్డ’ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అనుకోవాల్సిందే.
ఎవరు ఔనన్నా ,ఎవరు కాదన్నా, స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించింది స్వయానా ఆయన అల్లుడు చంద్రబాబే.
ఎన్టీఆర్ మాటల్లో చెప్పాలంటే, చంద్రబాబు ‘వెన్నుపోటు’ పొడిచారు. అదే చంద్రబాబు మాటల్లో అయితే అది జస్ట్ ‘నాయకత్వ మార్పిడి’ మాత్రమే.
రెండుసార్లు చంద్రబాబుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గద్దెనెక్కించారు.
అది చాలు, ‘నాయకత్వ మార్పిడి’ అనే ప్రక్రియకు జనం మద్దతిచ్చారని చెప్పడానికి.తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అనుకూల వర్గం చెప్పేమాట. ముచ్చటగా మూడోసారీ చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ (13 జిల్లాల రాష్ట్రం) ప్రజల మెప్పు పొందారంటే, ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవలేదు..
అది నాయకత్వ మార్పిడి మాత్రమేనని సర్టిఫికెట్ ఇచ్చినట్లు కాదా! ఇక, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విషయమై స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. ట్రైలర్పై స్పందన అడిగితే, ‘నా కన్నీళ్ళే సమాధానం’ అన్నారామె చెమర్చిన కళ్ళతో.
ఆనాటి ఆ సంఘటనల్లో ఏదీ తాను మర్చిపోలేదని చెబుతున్నారు లక్ష్మీపార్వతి. ‘దానికో కొడుకు పుడితే.. మీరంతా ఫినిష్’ అని చంద్రబాబు పాత్రధారి చెప్పే డైలాగ్, ‘మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావే ము… (రాయలేని బూతు పదం)’ అంటూ మరో పాత్రధారి (లేడీ) చెప్పే డైలాగ్.. ఇవన్నీ విన్నాక లక్ష్మీపార్వతి కళ్ళ వెంబడి నీళ్ళు రావని ఎలా అనుకోగలం.?’నన్ను కిడ్నాప్ చేశారు.. కొట్టారు, అవమానించారు.. చాలా చాలా చేశారు.
అన్నీ ఎన్టీఆర్ కోసమే భరించాను.. దురదృష్టవశాత్తూ నా బాధ, ఎన్టీఆర్ ఆవేదన బయటకు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు..’ అంటూ లక్ష్మీపార్వతి కంటతడి పెట్టారు.