తగ్గుముఖం పట్టిన కృష్ణమ్మ వరద
కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టికి వస్తున్న వరద గణనీయంగా తగ్గింది. దీంతో గడచిన రెండు వారాలుగా తెరచుకుని ఉన్న డ్యామ్ గేట్లు నేడో, రేపో మూసుకోనున్నాయి. ఆపై వచ్చే నీటిని డ్యామ్ పూర్తిగా నింపేందుకు వాడుకోవాలని కర్ణాటక అధికారులు ఆలోచిస్తుండటమే ఇందుకు కారణం. గత 10 రోజులుగా ఉరకలు పెట్టిన కృష్ణమ్మ, నేడు కాస్తంత శాంతించింది. నిన్న సాయంత్రం ఆల్మట్టిలోకి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దిగువకు లక్షన్నర క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు ఈ నీరు నారాయణపూర్ చేరుతుండగా, అక్కడి నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు రేపటి నుంచి వచ్చే వరద నీరు భారీగా తగ్గనుంది. ఇదే సమయంలో కృష్ణా, భీమా నదుల నుంచి వరద కొనసాగుతూ ఉంది.