కూకట్‌పల్లిలో హైడ్రామా.. ఏపీ పోలీసులకు చుక్కెదురు

ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు ఇచ్చిన లోకేశ్వర్‌రెడ్డిని విచారించేందుకు ఏపీ పోలీసులు కూకట్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

ఐటీ గ్రిడ్ వ్యవహారంలో విచారణ కోసం హైదరాబాద్‌ వెళ్లిన ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ ఆఫీసుపై ఆదివారం దాడి చేసిన నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తమ ఉద్యోగి కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.

ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు ఇచ్చిన లోకేశ్వర్‌రెడ్డిని విచారించేందుకు ఏపీ పోలీసులు కూకట్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న లోకేశ్వర్‌రెడ్డి వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో తెలంగాణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా స్థానికులు ఎలా విచారిస్తారంటూ నిలదీశారు. దీంతో ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఏపీ ప్రభుత్వ డేటా చోరీకి సంబంధించి సైబరాబాద్‌లో ఫిర్యాదు అందినందున తామే ఈ కేసును విచారిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఏపీ పోలీసులు ఈ కేసులో అనవసరంగా కలగజేసుకుని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *