ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త ప్రాణాంతకుడు అయ్యాడు, ముగ్గురి ప్రాణాలను బలిగొన్న కాల యముడు
కట్టుకున్నోడే గర్భిణి అయిన భార్య, ఇద్దరు పిల్లలపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ముగ్గురి ప్రాణాలను బలిగొని అక్కడ నుంచి పరారయ్యాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ దారుణం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్ల పురం లో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బోయ వెంకటలక్ష్మమ్మ. 35 పవన్ కుమార్12, పావని 9 మృత్యువాత పడ్డారు. వెంకటలక్ష్మమ్మ, శివ రాముడు కు 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. బేతంచెర్ల మండలం ముద్ద వరం ఆమె స్వగ్రామం. కుమారుడు బనగానపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి, కుమార్తె నాలుగో తరగతి చదువుతున్నారు.
శివ రాముడు ఆటో తో పాటు 15 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే ప్రధాన ఆధారం. భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ. ఇక పిల్లలు వద్దని గర్భం తొలగించుకోవాలని భర్త, మరో పెద్ద కావాలని భార్య పట్టుబడుతుండడంతో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవ నడుస్తోంది. పిల్లల విషయమై గురువారం ఉదయం మరోసారి గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే తన అక్క వెంకటలక్ష్మమ్మ, మేనల్లుడు, మేన కోడల్ని తన బావ శివ రాముడు డీజిల్ పోసి, నిప్పంటించి హతమార్చినట్టు మృతురాలి తమ్ముడు వెంకటాద్రి పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. అప్పటివరకు వారిది ఆత్మహత్య అని ప్రచారం జరిగింది కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబం లో తల్లి పిల్లలు చనిపోవడంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త పై హత్య కేసు నమోదు చేశారు.