ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, వేతనాలకుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రీన్‌ చానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికే జీతాలు అందించాలని స్పష్టం చేశారు.

పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందజేయాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.

ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు చేసే బాధ్యతను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుందని అధికారులు పేర్కొన్నారు.

దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,000 కోట్ల అదనపు భారం పడిందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీని ఫలితంగా 2017 మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జులై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి.

జూనియర్‌ లెక్చరర్‌కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయింది.

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ. 21,230 అయింది. స్కూల్‌ అసిస్టెంట్‌ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి 2019 జులై నాటి నుంచి రూ. 21,230 అయిందని అధికారులు సీఎంకు వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *