ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం…
రైతులకు శుభవార్త చెప్పిన సీఎం YS Jagan
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. రైతులకు పగటిపూట ఉచితంగా 9గంటల విద్యుత్ అమలు చేయాలని నిర్ణయం. గురువారం నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్..
1.విద్యుత్శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
2.రైతులకు ఉచిత విద్యుత్పై చర్చించిన జగన్
3.విద్యుత్ సరఫరాపై అధికారులకు ఆదేశాలు
ప్రభుత్వ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోజుకో సంచలన నిర్ణయంతో దూసుకెళుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రైతులకు సంబంధించిన మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
గురువారం (27-06-2019) నుంచి వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు.
బుధవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి 60శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్ అమలు చేయాలని అధికారులకు సూచించారు.
మిగతా 40శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
2020 జులై 30 నాటికి మిగతా ఫీడర్లలో 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.