ఇలాంటి పరిణామాలను తానెప్పుడూ చూడలేదన్నారు…జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లి

AP Capital: జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లి
ఏపీ రాజధాని విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ నెలకొందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇలాంటి పరిణామాలను తానెప్పుడూ చూడలేదన్నారు.

ఏపీ రాజధానుల అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంత రైతులు చేసింది త్యాగం కాదన్న ఆయన.. అమరావతిలో రాజధాని పెట్టొద్దని తాను బాబుకు గతంలో లేఖలు రాశానన్నారు.

రాజధాని విషయమై ఎంతో కన్ఫ్యూజన్ నెలకొందన్నారు. మూడు రాజధానుల విషయమై స్పందిస్తూ.. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం రద్దు చేసుకుంటే..

ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ పనైనా చేయడానికి ముందుకొస్తారా? అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

పోలవరంలో రూ.700 కోట్లు మిగిలితే సంతోషించానన్న ఉండవల్లి.. పవర్ ప్రాజెక్టు కోసం సదరు సంస్థ కోర్టుకు వెళ్లిందన్నారు.

పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయన్న ఆయన.. నిర్ణయాలను రాజకీయంగానే కాదు లీగల్ కోణంలోనూ చూడాలన్నారు.

రాజధాని మార్పు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం చెబుతోందని.. కానీ 2015లో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ జీవో జారీ చేసిందని కూడా కేంద్రమే చెప్పిందన్నారు ఉండవల్లి.

రాజధాని విషయంలో ప్రస్తుత పరిణామాలు గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. విశాఖను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ అభివృద్ధి వికేంద్రీకరణే మనకు కావాలన్నారు. పెద్ద సిటీ ఏర్పాటు చేయడమే హైదరాబాద్ విషయంలో మనం చేసిన పొరబాటన్నారు.

గ్రామ సచివాలయాలు మంచి కాన్సెప్ట్ అని ఉండవల్లి ప్రశంసించారు. రాష్ట్రంలో ఎక్కడ లైట్ వెలుగుతోంది, ఎక్కడ వెలగడం లేదని డ్యాష్ బోర్డులో చూసే చంద్రబాబుకు.. రాజధాని ఎక్కడుంటే ఏంటని అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

అమరావతి రైతులను నష్టపరుస్తున్నాననే కాన్సెప్ట్‌ను జగనే ఇంజెక్ట్ చేయగలిగారన్నారు.

ఆఫీసులను ఇతర నగరాలకు మారుస్తానంటే ఏమైనా ఇబ్బంది వచ్చేదా? అని ప్రశ్నించారు. 2014 జనవరిలో అసెంబ్లీ సమావేశంలో.. ఎట్టి పరిస్థితిల్లోనూ నవ్యాంధ్రలో హైదరాబాద్‌ను రిపీట్ చేయమని 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఓ నోటీసు ఇచ్చారన్నారు.

మూడు రాజధానుల బిల్లు విషయంలో అసెంబ్లీ తలుపులు మూసేశారని చంద్రబాబు వాపోతున్నారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో అంతకు మించి ఘోరంగా వ్యవహరించారని ప్రధాని మోదీనే చెప్పారు.

ఈ విషయాన్ని ఎందుకు చర్చించరని ఉండవల్లి ప్రశ్నించారు. ఈ విషయాన్ని చర్చించకపోవడానికి భయమే కారణమన్న ఆయన… దేశంలో ఎక్కడ ఏ ఘోరం జరిగినా, రేప్ జరిగినా ఆంధ్రా కంటే బ్యాడ్ కాదనే పరిస్థితిలో మనం ఉండి కూడా.. ఎవరో ఫీలవుతారనే భయంలో ఉన్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *