ఏపీలో కొత్త మంత్రులు ఫిక్స్.. సామాజిక న్యాయానికే సీఎం జగన్ ఓటు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లోకి తీసుకునే ఇద్దరు కొత్త మంత్రులను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు స్థానాలకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
అలాగే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు కేటాయిస్తారని సమాచారం.
స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు.. ఇటీవల కరోనా విషయంలో స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కేబినెట్లోకి తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పైగా మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా, అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఇక, శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఖాళీ చేసిన స్థానాన్ని అదే కులానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇవ్వనున్నట్లు సమాచారం.
అలాగే శానసమండలిని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా.. ఇంకా పార్లమెంటు ఆమోదింకపోవడంతో మండలి మనుగడలోనే ఉంది.
ఈ తరుణంలో ప్రస్తుతం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ వల్ల ఖాళీ అయిన స్థానానికి ఇక 9 నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఆ స్థానానికి ఎన్నిక జరగదు.
మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని మర్రి రాజశేఖర్కు కేటాయించినట్లు తెలుస్తోంది.
అలాగే గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ భార్య జకియా సుల్తానాకు, మరో సీటును పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోజెస్ రాజుకు కేటాయించబోతున్నట్లు సమాచారం.