మసూద్‌కు చైనా మద్దతు.. మోదీపై రాహుల్ విమర్శలు!

ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు ఉగ్రవాది మసూద్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నాలుగోసారి అడ్డుకున్న విషయం తెలిసిందే.

జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాస భద్రతా మండలిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్, మోదీ బలహీనమైన వ్యక్తిని పోల్చి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని ధ్వజమెత్తారు.

‘బలహీనమైన మోదీ జీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత్ చేస్తోన్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.

చైనాతో నమో దౌత్య సంబంధం ఎలాంటిదంటే.. గుజరాత్‌లో జిన్‌పింగ్‌తో పర్యటిస్తారు.. దిల్లీలో జిన్‌పింగ్‌ను హగ్‌ చేసుకుంటారు… చైనాలో జిన్‌పింగ్‌ ముందు తలవంచుతారు’ అంటూ రాహుల్‌ తన ట్వీట్‌లో దుమ్మెత్తిపోశారు.

మసూద్‌కు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటానికి విచారకరమైన రోజుగా కాంగ్రెస్ అభివర్ణించింది.

ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకోవడమంటే ఉగ్రవాదం మూలాలున్న పాక్‌తో దానికి వీడదీయరాని సంబంధం ఉందని స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

అంతేకాదు, దీనిని ప్రధాని మోదీ దౌత్య వైఫల్య పరంపరగా పేర్కొన్నారు.

పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి.

శాశ్వత సభ్యదేశాలు చేసిన తీర్మానంపై భద్రతా మండలి ఆంక్షల కమిటీ 10 రోజులు గడువు విధించింది. దీనిపై బుధవారం చర్చ జరగగా చివరి నిమిషంలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రతిపాదనకు సాంకేతికంగా మోకాలడ్డింది.

మసూద్ విషయంలో చైనా ఇలా అడ్డుతగలడం నాలుగో సారి. గతంలో 2009, 2016, 2017లోనూ చైనా ఇదే వైఖరి ప్రదర్శించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *