కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, కపిల్ సిబల్ మోదీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

చైనా ఆక్రమణ విషయంలో మోదీ ఆ హామీ ఇవ్వగలరా? చిదంబరం సూటి ప్రశ్న

సరిహద్దుల్లో భారత భూభాగాల్లోకి చొచ్చుకొస్తున్న చైనా.. ఈ ప్రాంతాలు తమవేనంటూ తిరిగి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్‌డీయే సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.


గాల్వన్ లోయ వద్ద చైనాతో చోటుచేసుకున్న ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష కాంగ్రెస్ పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, కపిల్ సిబల్ మోదీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి, దురాక్రమణలకు పాల్పడున్న చైనా చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఎందుకు ఖండించరని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ శనివారం ప్రశ్నించారు.

చైనా దురాక్రమణలను నిలువరించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని అన్నారు.

అయితే, చైనా దుందుడుకు చర్యలను ప్రధాని బహిరంగా ఖండించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. దేశంలోకి ఎవరూ చొరబడలేరని మోదీ చేసిన ప్రకటన సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు.

సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సైతం కేంద్రాన్ని నిలదీశారు. ఇండో–చైనా సరిహద్దుకు చెందిన పలు శాటిలైట్‌ ఫొటోలను ట్విట్టర్ పోస్ట్‌ చేసి, వాటి ఆధారంగా కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించారు.

2020 మే 22, జూన్ 22న భారత్–చైనా సరిహద్దుల్లోని ఫొటోల్లో ఉన్న తేడాలను గమనించండి అంటూ ఆ ట్వీట్‌కు క్యాప్షన్‌ జత చేశారు.

యూపీఏ హయాంలో ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్‌‌ఎఫ్)కు ప్రజలు డొనేట్ చేసిన డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌‌జీఎఫ్‌)కు అక్రమంగా తరలించారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యలపై చిదంబరం మండిపడ్డారు.

‘నడ్డా వాస్తవాలకు అనుగుణంగా ఉండండి. వక్రీకరించిన అర్ధ సత్యాల ద్వారా గతంలో జీవించకండి. దేశ భూభాగంలోకి చైనా అత్రికమణ గురించి మేం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

ఒకవేళ ఆర్‌‌జీఎఫ్‌ రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేస్తే.. తాను ఆక్రమించిన ఇండియాలోని భూభాగాన్ని ఖాళీ చేసి యథాతథ స్థితిని చైనా పునరుద్ధరిస్తుందని మోడీ హామీ ఇవ్వగలరా?

అర్ధ సత్యాలు చెప్పడంలో నడ్డా మంచి నైపుణ్యత సాధించారు. నా తోటి కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ఈ సగం సత్యాలను బయట పెట్టారు’ అంటూ చురకలంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *