చంద్రబాబు మోసకారి.. మామకే వెన్నుపోటు పొడిచారు: అమిత్ షా
అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడింది. మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
1.రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా 2.చంద్రబాబు టార్గెట్గా విమర్శలు 3.జగన్ను టార్గెట్ చేసిన బీజేపీ అధ్యక్షుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మోసకారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సాయం చేసినా.. దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
పుల్వామా దాడిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గురువారం రాజమండ్రిలో పర్యటించిన షా..
అర్బన్ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన షా చంద్రబాబును టార్గెట్ చేశారు
మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ ముఖ్యమంత్రిఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఢిల్లీ, కోల్కతా వెళ్లి ధర్నాలు చేశారు.. ఆయన ధర్నా చేయాల్సింది వారి పార్టీ కార్యాలయం ముందేనన్నారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో తెలంగాణలో ప్రచారం చేస్తూ.. మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చామన్నారు షా. ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని.. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ.180కోట్లు.. గెయిల్, హెచ్పీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు. . కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని చెప్పారు.
చంద్రబాబు, జగన్లతో ఏపీ అభివృద్ధి జరగదన్నారు అమిత్ షా. టీడీపీ, వైసీపీలు వారి కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయని..
రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలంటూ నిప్పులు చెరిగారు. బీజేపీతోనే ఆంధ్ర అభివృద్ధి చెందుతుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
పుల్వామా ఘటనపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు షా. చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం.. మన ప్రధానిపై లేదన్నారు.
ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని.. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలి.. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ అధ్యక్షుడు.