కమలంతో సైకిల్ ముడి.. ఏమిటో ఈ మాయ…?
సైకిల్ అనగానే తెలుగు నాట తెలుగుదేశం పార్టీ గుర్తుకు రావడం సహజం. కానీ, ఉత్తరప్రదేశ్లో ఇంకో సైకిల్ పార్టీ కూడా వుంది.. అదే సమాజ్ వాదీ పార్టీ.
అక్కడ చాలాకాలం అధికారంలో వున్న బలమైన రాజకీయ పార్టీగా సమాజ్ వాదీ పార్టీకి వున్న గుర్తింపు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.?
దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఒకానొక సందర్భంలో సమాజ్ వాదీ పార్టీ ఎదిగింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు.
ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ అధికారం కోల్పోయాక, తిరిగి పుంజుకోవడానికి నానా తంటాలూ పడ్తోంది.
చివరికి చేసేది లేక, తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కూడా కలిపింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎస్పీ – బీఎస్పీ మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. కాంగ్రెస్తో కొంత స్నేహంగా, బీజేపీతో పూర్తి వైరుధ్యంతో ఈ కూటమి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేయబోతున్న సంగతి తెల్సిందే.
అయితే, అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోడీపైనా, భారతీయ జనతా పార్టీ పైనా ప్రశంసల వర్షం కురిపించేశారు.
మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధాని అవ్వాలని ఆకాంక్షించారు. దాంతో, ఉత్తరప్రదేశ్లో సైకిల్ పార్టీ శ్రేణులు షాక్కి గురయ్యాయి.
మొన్నీమధ్యనే కోల్కతాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాల కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపడితే, ఆ కార్యక్రమంలో ములాయం తనయుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పాల్గొని, నరేంద్ర మోడీ సర్కార్పై నిప్పులు చెరిగిన విషయం మనందరికీ తెలిసిందే ,అయితే, యూపీ రాజకీయాలు.. అందునా సమాజ్ వాదీ పార్టీలో రాజకీయాలు చాలా వింతగా కన్పిస్తాయి.
వృద్ధాప్యం కారణంగా ములాయం సింగ్ చాదస్తం ప్రదర్శిస్తోంటే, వాటిని ఆయన తనయుడే జీర్ణించుకోలేకపోతున్నాడాయె.
నిజానికి, ఆ మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రీ కొడుకుల మధ్య రచ్చే సమాజ్ వాదీ పార్టీని అత్యంత దారుణంగా ముంచేసిన విషయం విదితమే.
పార్టీ ఎవరిదన్న విషయమై వివాదం ఎన్నికల కమిషన్కీ, కోర్టుకీ కూడా చేరింది. తన తండ్రిని పార్టీ నుంచి అప్పట్లో అఖిలేష్ బయటకు పంపినా, ఆ తర్వాత తిరిగి ఆయన్ను తీసుకొచ్చారు పార్టీలోకి.
మరి, మోడీకి ములాయం ఇప్పుడు మద్దతిస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఈ విషయంపై పూర్తి అవగాహనా కోసం మనం వేసే ఉండాల్సిందే….
యూపీ రాజకీయంతో మనకేంటి సంబంధం.? అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలకి సంబంధించి అఖిలేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్, అఖిలేష్పై చాలా ఆశలే పెట్టుకున్నారు. చంద్రబాబు సంగతి సరే సరి. ఈ రోజు కూడా అఖిలేష్తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీ దేశంలో అతి పెద్ద రాష్ట్రం కావడంతో..
అక్కడ సమాజ్ వాదీ పార్టీ మెజార్టీ స్థానాల్ని గెలిస్తే, ఆ బలం తమకు ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగపడ్తుందన్నది టీఆర్ఎస్, టీడీపీ ఆలోచన.