AP బడ్జెట్ పై మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణ రావు గారి విశ్లేషణ

ప్రతి బడ్జెట్లో రెవెన్యూ విభాగం, మూలధన విభాగం ఉంటాయి. సాలుసరి పన్నుల రూపంలో ఇతరత్రా వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఆదాయంగా చూపెట్టడం జరుగుతుంది.

అదేవిధంగా జీతాలు, పెన్షన్లు లాంటి సాలుసరి ఖర్చులను రెవెన్యూ ఖర్చులుగా చూపెట్టడం జరుగుతుంది.

ఈ విభాగంలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. అది చాలా శుభకరమైన పరిణామం.

అదే ఖర్చు ,ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది.

ఇక మూలధన పట్టికలో వచ్చే నిధులు అప్పుల రూపంలో ఉంటాయి. ఖర్చు ప్రాజెక్టుల మీద ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్థిరాస్తుల మీద ఉంటుంది.

తీసుకున్న మొత్తం అప్పులను ద్రవ్యలోటు అంటారు.

ఈ తీసుకున్న అప్పులో కొంత భాగం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగిస్తే అంతవరకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి ఉండే నిధులు తక్కువవుతాయి.

ఏ దేశంలో రెవెన్యూ లోటు సున్నా ఉండి మొత్తం అప్పులు ప్రాజెక్ట్స్‌ మీద ఖర్చు పెడతారో ఆ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది.

ఇంకొక చిన్న అంశం ప్రాథమిక లోటు. తెచ్చే అప్పులు కనీసం పాత వడ్డీలను కట్టడానికైనా ఉపయోగపడితే ప్రాథమిక లోటు ఉండదు.

అప్పుడు భవిష్యత్తులో మరింత అప్పుల భారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రాథమిక లోటు ఉండి తెచ్చిన అప్పులు కట్టే వడ్డీల కన్నా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అప్పుల భారం పెరుగుతున్నట్టు అర్థం. ఇది మంచి పరిణామం కాదు.

2017– 18లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఒక లక్షా 91 వేల కోట్లు. 18–19కి ఈ ఆదాయం ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినా, సంవత్సరాంతానికి రెండు శాతం పెరిగి లక్షా 95 వేల కోట్లు అయింది.

ఈ ఆదాయాన్ని ఏకంగా 15 శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు.

ఇంత స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు.

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు.

కేంద్రం పన్నులలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం పెంచిన తర్వాత కేంద్రం గ్రాంట్లను తగ్గించింది.

అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అమాంతంగా అదనంగా వస్తాయని చూపెట్టి అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్‌ను అపహాస్యం చేయడమే అవుతుంది.

అదేవిధంగా సొంత పన్నుల రాబడిలో కూడా పొంతన లేని పెరుగుదలను చూపెట్టుకు న్నారు.

జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక మద్యం, పెట్రోల్‌ మీద తప్పితే మిగిలిన వాటిపై అమ్మకం పన్ను పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు.

అటువంటి పరిస్థితుల్లో ఇంత అనూహ్యంగా రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అంచనా వేశారో అర్థం కాకుండా ఉంది.

ఇక అప్పుల విష యానికొస్తే 2017–18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 86 వేల కోట్ల అప్పు, 2018–19 సంవత్సరంలో 39 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది.

దీనికి అదనంగా ఈ సంవత్సరం 17 శాతం వృద్ధితో 47 వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రతిపాదించారు.

రెవెన్యూ లోటు రెండు వేల కోట్ల రూపాయలుగా చూపెట్టినా అంచనా వేసిన రాబడి వాస్తవ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చాలా పెరిగే అవకాశం ఉంది.

32 వేల కోట్లుగా అంచనా వేసిన ద్రవ్యలోటు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆర్థిక పరిస్థితి దారుణం

అన్నిటికీ మించి ప్రాథమిక లోటు 14, 570 కోట్లు. అంటే మనం తీసుకునే అప్పు వడ్డీలు కట్టగా కూడా ఇంకా 14,570 కోట్లు అప్పు ఉండి భవిష్యత్తులో ఇంకా రుణ భారం, వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రుంగ తీయబోతున్నాయి.

27 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు 39 వేల కోట్లు ఉంటే రెండు లక్షల 25 వేల కోట్ల బడ్జెట్‌ ఉన్న మన రాష్ట్రానికి ప్రాథమిక లోటు 14,570 కోట్లు ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజారంజకంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు.

ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తే బాగుంటుందో ఆర్థిక శాస్త్రవేత్తలు కొన్ని సూచికలు స్థిరీకరించారు.

వాటికి కొంత అటూఇటుగా కొన్ని సంవత్సరాలు బడ్జెట్‌ను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయదు.

కానీ ఆ సూచికలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆచరణ సాధ్యం కాని వనరులు లేని ఖర్చు మాత్రమే చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్‌ కేవలం భ్రమల భ్రాంతుల బడ్జెట్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా.

ఎవరి చేతి లోనూ మంత్ర దండాలు లేవు కదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *