రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.. సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
ప్రముఖ సినీ నటుడు రావికొండలరావు మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.’’ అని సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
అలాగే ‘‘సీనియర్ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాప్రపూర్ణ రావి కొండలరావు గారి మరణం విచారకరం.
తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో, హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు రావి కొండలరావు (88) మంగళవారం (జూలై 28) హైదరాబాద్లోని వివేకానంద ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరంగా జీవితం గడిపిన రావి కొండలరావు మృతితో టాలీవుడ్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.