ఆ రూ. 5 కోట్లు సీఎం జగన్ కుటుంబీకులవేనా.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో రాజకీయ దుమారం

తమిళనాడు పోలీసులకు పట్టుకున్న రూ. 5.27 కోట్ల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ నేత లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో పోలీసులకు పట్టుబడ్డ రూ. 5.27 కోట్ల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.

ఆ వాహనం రాష్ట్రానికి చెందిన మంత్రి శ్రీనివాసరెడ్డిదేనంటూ తెలుగు దేశం పార్టీ జారీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా గట్టిగా చెబుతున్నారు.

తాజాగా, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా లాగి టార్గెట్ చేశారు.

ఈ మేరకు శనివారం నారా లోకేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేశారు.

నారా లోకేష్ ఏమన్నారంటే..
‘‘ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడింది. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది?

ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్లేది నిజమేనా? ఇవిప్పుడు తేలాలి.

చెన్నైలో ఒకే అడ్రస్‌తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది.

పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేసారు. అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా!

అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్లించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం.. ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే! ఇప్పుడూ అదే నడుస్తోంది.

ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.’’ అని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *